'కాక్రోచ్‌' గెలిచింది | Pralhad Joshi gets additional charge as Education Minister | Sakshi
Sakshi News home page

'కాక్రోచ్‌' గెలిచింది

Jul 26 2026 2:40 AM | Updated on Jul 26 2026 2:40 AM

Pralhad Joshi gets additional charge as Education Minister

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అనంతరం స్వీట్లు పంచుతున్న సీజేపీ ప్రతినిధులు సౌరవ్‌ దాస్, అశుతోష్‌ రాంకా.. అభిజీత్‌ దీప్కే విజయ సంకేతం..

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. ఆందోళన విరమించిన కాక్రోచ్‌ జనతా పార్టీ

కేంద్రం, సీజేపీ మధ్య మూడో విడత చర్చలు 

మరో రెండు కీలక డిమాండ్లకూ కేంద్రం అంగీకారం  

బాధిత విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం 

నిరసనకారులపై కేసులు ఎత్తివేస్తామన్న జేపీ నడ్డా  

జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ సంబరాలు  

భయపడకపోతే విజయం సులభమేనన్న అభిజీత్‌ దీప్కే  

విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి 

కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, రాహుల్‌గాంధీ డిమాండ్‌  

ఇది ప్రజాస్వామ్య విజయమన్న సోనమ్‌ వాంగ్‌చుక్‌  

ప్రల్హాద్‌ జోషీకి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు  

న్యూఢిల్లీ:  బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) నిరూపించింది. నీట్‌–యూజీ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువతరాన్ని ఉద్యమం వైపు మళ్లించి అనుకున్నది సాధించింది. సీజేపీ పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయక తప్పలేదు. గత పది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల కలత చెందానని ఆయన చెప్పారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నానని స్పష్టంచేశారు. ఇప్పటి పరిస్థితిని దేశ విద్రోహ శక్తులు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వొద్దన్న కారణంతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు యువతకు ప్రధాన్‌ లేఖ రాశారు. ఢిల్లీలో పరిణామాలు శనివారం చకచకా జరిగిపోయాయి. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి ప్రల్హాద్‌ జోషీకి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించింది.  


కేంద్రం, సీజేపీ చర్చలు సఫలం  
మరోవైపు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రతినిధులు అశుతోష్‌ రాంకా, సౌరవ్‌ దాస్‌ మధ్య మూడో విడత చర్చలు జరిగాయి. సీజేపీ లేవనెత్తిన మరో రెండు కీలక డిమాండ్ల పట్ల కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. పేపర్‌ లీక్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని, నిరసనకారులపై కేసులు కొట్టివేయాలని సీజేపీ డిమాండ్‌ చేయగా, ప్రభుత్వం అందుకు అంగీకారం తెలియజేసింది. మొత్తానికి మూడు కీలకమైన డిమాండ్లు నెరవేరడంతో కాక్రోచ్‌ జనతా పారీ్టలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. శనివారం ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ సంబరాల్లో మునిగిపోయింది. ఆశించిన లక్ష్యం నెరవేరడంతో.. 49 రోజులుగా సాగుతున్న పోరాటాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నిరసన ప్రదేశాల నుంచి అందరూ శాంతియుతంగా వైదొలగాలని ఆ పార్టీ నేత సౌరవ్‌ దాస్‌ కోరారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నడ్డా వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల మేరకు పరిహారం అందిస్తామని తెలిపారు. అయితే, ఎంత ఇస్తారన్నది ఆయన పేర్కొనలేదు.  

శనివారం జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థుల సంబరాలు   

జంతర్‌మంతర్‌ వద్ద సంబరాల హోరు  
కేంద్ర మంత్రి రాజీనామా చేసిన సంగతి తెలియడంతో జంతర్‌మంతర్‌ వద్ద శనివారం పండుగ వాతావరణం నెలకొంది. నిరసనకారులు త్రివర్ణ పతాకాలు చేతబూని, కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. ‘చక్‌ దే ఇండియా’వంటి పాటలు వినిపిస్తుండగా, వారు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం కనిపించింది. చాలామంది డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ చిత్రపటాలను, పోస్టర్లను ప్రదర్శించారు. మంత్రి రాజీనామాను తమ పోరాటానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే జంతర్‌మంతర్‌ వద్ద జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనుకున్నది చేసి చూపించామని చెప్పారు. భయపడకపోతే గెలవవచ్చనడానికి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామే నిదర్శనమని స్పష్టంచేశారు. సోనమ్‌ వాంగ్‌చుక్‌ సైతం స్పందించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. శాంతి, సహనం, పట్టుదలకు దక్కిన విజయం అని తేల్చిచెప్పారు. సీజేపీకి, దేశంలోని జెన్‌ జెడ్‌కి అభినందనలు తెలియజేశారు.  

అవినీతికి ప్రతీక ప్రధాన్‌  
ప్రధాని మోదీ మొండితనం ఓడిపోయిందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను ‘విక్టరీ ఆఫ్‌ ట్రూత్‌’గా అభివర్ణించారు. ‘‘యువతకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. లాఠీలు, పెల్లెట్‌ గన్‌లతో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’అని ఖర్గే డిమాండ్‌ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన.. ప్రభుత్వాన్ని ఎవరూ తమ సొంత జాగీరులా నడపలేమని బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ పాలకవర్గానికి హెచ్చరిక జారీ చేసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వాన్ని సొంత జాగీరుగా భావిస్తే ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అవినీతికి ప్రతీక అని అని మండిపడ్డారు. ఆయన వెళ్లిపోవడం మంచిదేనని చెప్పారు. ఆందోళన సమయంలో విద్యార్థులపై జరిగిన అకృత్యాలకు గాను ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. ‘‘ప్రజాస్వామ్యానికి ఇది గొప్ప విజయం, దేశ ప్రజలందరికీ అభినందనలు’’అని ఆమ్‌ ఆద్మీ పారీ్ట(ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement