ధర్మేంద్ర ప్రధాన్‌ (మాజీ మంత్రి) రాయని డైరీ | Rayani Diary of Dharmendra Pradhan | Sakshi
Sakshi News home page

ధర్మేంద్ర ప్రధాన్‌ (మాజీ మంత్రి) రాయని డైరీ

Jul 26 2026 1:36 AM | Updated on Jul 26 2026 1:36 AM

Rayani Diary of Dharmendra Pradhan

మాధవ్‌ శింగరాజు

రాజీనామా లేఖను ప్రధానమంత్రికి అందించి బయటకు రాగానే నా జ్ఞాపకాలు ముప్పై ఏళ్లు వెనక్కు వెళ్లాయి. ఆ రోజు... భువనేశ్వర్‌లో, వందల మంది విద్యార్థులను వెంటేసుకుని వెళ్లి ‘‘జేబీ పట్నాయక్, దిగిపో... జేబీ పట్నాయక్, దిగిపో...’’ అని సచివాలయం భవనం బీటలు వారేలా నేను నినాదాలిస్తున్నాను. ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్‌ కర్టెన్‌ను కాస్త తొలగించి, కిటికీ అద్దంలోంచి కిందికి చూస్తూ ఏదో అడుగుతున్నారు. పక్కనున్నవారు ఆయన చెవిలో ఏదో చెబుతున్నారు. మరుక్షణం సీఎం కర్టెన్‌ మూసేశారు. పోలీసులు ఒక్కసారిగా లాఠీ ఛార్జ్‌ మొదలు పెట్టారు. నా ముఖం చిట్లిపోయింది. నా ఎముకలు సున్నం అయ్యాయి. నా వెంట ఉన్న విద్యార్థులకూ గాయాలయ్యాయి. అంతా రక్తం వోడుతున్నాం. అయినా మేము అక్కడి నుంచి కదల్లేదు. 

‘‘ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహించి పట్నాయక్‌ తక్షణం రాజీనామా చేయాలి’’ అని విద్యార్థులందరం డిమాండ్‌ చేస్తూనే ఉన్నాం. నినాదాలు ఇస్తూనే ఉన్నాం. పోలీసులు మాపై విరుచుకు పడుతూనే ఉన్నారు. అంత జరుగుతున్నా పట్నాయక్‌ రాజీనామా చేయలేదు. ‘‘దోషులపై చర్యలు తీసుకుంటాం’’ అని మాత్రం అన్నారు. నాడు నేను ఏ స్థానంలో నిలబడి పోరాడానో... నేడు అదే స్థానంలో జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థులు నిలబడ్డారు. నాడు నేను ఏ అధికార పీఠాన్ని ప్రశ్నించానో... నేడు అదే పీఠంపై కూర్చొని ఉన్న నన్ను విద్యార్థులు ప్రశ్నించారు. కాలం ఎంత విచిత్రమైనది! నాలోని పాత విద్యార్థి నాయకుడు, నేటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఓడించాడు. నేను రాజీనామా చేశాను. 

జంతర్‌ మంతర్‌లో విద్యార్థుల ఆందోళన మొదలైనప్పటి నుంచీ– 36 రోజులుగా–నాడు పట్నాయక్‌ మాతో అనిన మాటే, నేనూ విద్యార్థులతో అంటూ వచ్చాను... ‘‘దోషులపై చర్యలు తీసుకుంటాం’’ అని! కానీ, విద్యార్థులు వినలేదు. వినకపోవటంలో ఎప్పుడూ న్యాయమే ఉంటుంది. ప్రశ్నాపత్రాలు ఇచ్చి, వాటికి సమాధానాలు రాయమని ప్రభుత్వం విద్యార్థులను అడుగు తున్నప్పుడు, ప్రశ్నాపత్రాల లీకేజీపై విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వమూ సరైన సమాధానాలు చెప్పాల్సిందే. ప్రభుత్వం చెప్పింది. కానీ వారికి ఆ సమాధానాలు సంతృప్తికరంగా లేవు. జీరో మార్కులు వేశారు. గవర్నమెంట్‌ ఫెయిల్‌ అనేశారు! ‘‘ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే...’’ అని పంతం పట్టారు. 

మంత్రి రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? రాజీనామా చేయటం తప్ప మరేమీ జరగదు. విద్యాశాఖ ప్రధాని కిందకు వెళుతుంది. లేదంటే, ఇంకో మంత్రికి అదనపు శాఖ అవుతుంది. కొత్త మంత్రిని తీసుకున్నా,ఆ మంత్రికి విద్యాశాఖ అర్థం కావటానికి సమయం పడుతుంది. అంతవరకూ విద్యాశాఖలో ఒక్క నిర్ణయమూ జరగదు. ఒక్క తీర్మానమూ కదలదు. ఒక్క అమలూ కుదరదు. విద్యార్థులకు ఏం న్యాయం జరిగినట్లు?! అయినప్పటికీ నేను రాజీనామా చేశాను. ఇది ప్రశ్నాపత్రాలు లీక్‌ అయినందుకు చేసిన రాజీనామా కాదు. విద్యార్థుల డిమాండ్‌కు తలవొగ్గి చేసిన రాజీనామా కూడా కాదు. రాజీనామా చేయకపోతే, వారిని ఉసిగొల్పు తున్న చేతుల్లోనే వారి భవిష్యత్తును ఉంచి నట్లౌతుందన్న ఆందోళనతో చేసిన రాజీనామా!

ఇదేమీ త్యాగం కాదు, ప్రజాస్వామ్యంపై విద్యార్థులకు నమ్మకం కలిగించటం. ఇదేమీ ఓటమి కాదు, విద్యార్థుల ఆవేదనను గౌరవించటం. చేతిలోని పెన్నును పక్కన పెట్టి, కుర్చీలోంచి నేను లేస్తున్నప్పుడు నాలో తెలియని ప్రశాంతత! ఇప్పుడిక నేను మంత్రిని కాకపోవచ్చు... కానీ, మళ్లీ నా పాత రోజుల్లోకి వెళ్లి, విద్యార్థుల పక్షాన నిలబడ్డానన్న తృప్తిని మిగుల్చుకున్న ఒక విద్యార్థి నాయకుడిని! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement