న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించారు. అలాగే, ప్రధానమంత్రి సలహా మేరకు.. ప్రస్తుతం ఉన్న శాఖలతో పాటు విద్యాశాఖ బాధ్యతలను కూడా కేంద్ర కేబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతగా అప్పగించాలని రాష్ట్రపతి ఆదేశించారు.
మరోవైపు, ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన కర్ణాటక నుంచి లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కేంద్ర ప్రభుత్వంలో ఆయన బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ధారవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా దేశానికి స్వచ్ఛమైన, స్థిరమైన ఇంధనం కోసం ఆయన దృష్టి సారించారు. 2030 నాటికి పునరుత్పాదక, శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించడం, 2070 నాటికి నికర కార్బన్ ఉద్గారాలను సున్నాకు చేర్చే లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కృషి చేస్తున్నారు. ఈ లక్ష్యాలు భారత ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రతకు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది.
పునరుత్పాదక ఇంధన రంగంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ అమలు చేస్తోంది. ఇందులో ప్రభుత్వ విధానాలు, సాంకేతిక పురోగతి, ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ప్రహ్లాద్ జోషి పలు కీలక కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తున్నారు.
కాగా, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలతో విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదే రోజున తాత్కాలికంగా కొత్త మంత్రిని నియమించడం గమనార్హం.


