కెనడాలో ఎడ్మింటన్లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 23 ఏళ్ల దమన్ ప్రీత్ కౌర్ దారుణ హత్య కలకలం రేపింది. ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఎడ్మంటన్ పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలు, జూలై 9న పంజాబ్లోని లుధియానా జిల్లా, సమ్రాలా నివాసి దమన్ ప్రీత్కౌర్ స్పృహలేకుండా, తీవ్ర గాయాలతో పడి ఉందనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆగ్నేయ ఎడ్మంటన్లోని సిల్వర్బెర్రీ నివాస ప్రాంతానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కౌర్ కన్నుమూసింది. ఇది హత్యేనని పోస్ట్ మార్టంలో నివేదిక ద్వారా ధృవీకరణ అయింది.
ఈ కేసులో గత కొన్నాళ్లుగా దమన్ ప్రీత్ కౌర్తో కలిసి నివసిస్తున్న (Live-in Partner) ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల రీతీష్ కమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతనే గొంతు నులిమి చంపినట్టు భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వేరే అనుమానితులు ఎవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు. 'సెకండ్ డిగ్రీ మర్డర్' ఆరోపణలు నమోదు చేశారు.
మరోవైపు కౌర్ మృతదేహాన్ని భారతదేశంలోని ఆమె స్వగ్రామానికి తరలించడానికి, అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబ సభ్యులకు సహాయంగా ఒక GoFundMe క్యాంపెయిన్ ప్రారంభించారు. 20 వేల డాలర్లకు గాను ఇప్పటికే దాదాపు 19వేల డాలర్ల విరాళాలు అందాయి.
ఇదీ చదవండి: 150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్లో మానవత్వపు పరిమళాలు


