సవతి కొడుకును సుపారీ ఇచ్చి చంపించిన సవతితల్లి | Nirmal Police Solved Aslam Khan YSR Nagar Murder Case | Sakshi
Sakshi News home page

సవతి కొడుకును సుపారీ ఇచ్చి చంపించిన సవతితల్లి

Jul 25 2026 5:21 AM | Updated on Jul 25 2026 5:21 AM

Nirmal Police Solved Aslam Khan YSR Nagar Murder Case

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ డాక్టర్‌ జానకి షర్మిలా

మహారాష్ట్ర ముఠాతో రూ.6లక్షలకు ఒప్పందం... ఆరుగురు నిందితుల అరెస్టు

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఈ నెల 15న సంచలనం సృష్టించిన ఆటోడ్రైవర్‌ అస్లాంఖాన్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. రూ.6లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని సవతి తల్లి హత్య చేయించింది. ప్రధాన కుట్రదారు అన్వరీబేగంతోపాటు మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్‌లోని ప్రధాన పోలీసు కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మీల శుక్రవారం వివరాలు వెల్లడించారు. నిర్మల్‌ పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీకి చెందిన అస్లాంఖాన్‌(23)కు సవతి తల్లి అన్వరీబేగంతో కొంతకాలంగా వివాహేతరసంబంధం ఉంది. అతడు మరో యు వతిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోవద్దని, తమ సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి చేసింది.

పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించింది. ఈ విషయం అస్లాంఖాన్‌ తన బాబాయికి చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిసి వివాదం ఏర్పడింది. అస్లాంఖాన్‌ భయంతో అదే కాలనీలోని తన బాబా యి ఇంటి వద్ద ఉంటూ ఆటో నడుపుతుండేవాడు. తమ సంబంధం అందరికీ తెలిసి పరువు పోయిందని, తనకు దూరమై మరో వివాహం చేసుకుంటాడని అన్వరీబేగం కక్ష పెంచుకుంది. రూ.6లక్షలతో సుపారీ హత్యకు మహారాష్ట్రకు చెందిన తన పరిచయస్తుడు ముఖీద్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.50వేలు చెల్లించి హత్య తర్వాత మిగతా మొత్తం చెల్లించడానికి ఒప్పందం చేసుకుంది. అస్లాంఖాన్‌ ఫొటోలు, వ్యక్తిగత వివరాలు అందజేసింది. తన సోదరుడు షేక్‌ మహమ్మద్‌కు కూడా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఈ కుట్రలో భాగస్వామిని చేసింది.

అస్లాంఖాన్‌ హత్యకు ముఖీద్, అఫ్రోజ్, సాయినాథ్‌ పవార్‌ జూలై ఒకటిన నిర్మల్‌కు వచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద హత్యకు యత్నించగా.. జన సంచారం ఎక్కువగా ఉండడంతో వెనక్కి తగ్గి మహారాష్ట్రకు వెళ్లిపోయారు. తొలి ప్రయత్నం విఫలం కావడంతో జూలై 14న ముఖీద్, అఫ్రోజ్, షేక్‌ షాహిద్‌ అలియాస్‌ సల్మాన్, సాయినాథ్‌ పవార్‌ అద్దె స్కార్పియోలో మహారాష్ట్ర నుంచి బయల్దేరి నిర్మల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అన్వరీబేగం, షేక్‌ మహమ్మద్‌లను కలిశారు. అస్లాంఖాన్‌ కదలికలను ఎప్పటికప్పుడు అన్వరీబేగం నిందితులకు చేరవేసింది. అస్లాంఖాన్‌ ప్రయాణికులతో ఆటోలో నిర్మల్‌ బస్టాండ్‌ వైపు వెళ్తుండగా.. ముఖీద్, అఫ్రోజ్‌ స్కారి్పయో వాహనం నుంచి దిగి అడ్డగించారు. అస్లాంఖాన్‌ను బయ టకు లాగి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు.

తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు మృతిచెందాడు. ఘటన అనంతరం నిందితులు నాందేడ్‌ వైపు పారిపోయారు. పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల ఆచూకీ గుర్తించారు. ముఖిద్, అఫ్రోజ్, షేక్‌ షాహిద్‌ అలియాస్‌ సల్మాన్, సాయినాథ్‌ పవార్, షేక్‌ మహమ్మద్‌లను అరెస్ట్‌ చేసి స్కార్పియో కారు, మోటార్‌సైకిల్, రెండు కత్తులు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

అన్వరీబేగంను ఈ నెల 17న అరెస్ట్‌ చేసి విచారించగా విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది. నిందితులను అరెస్ట్‌ చేయడంలో కీలకంగా పనిచేసిన నిర్మల్‌ డీఎస్పీ పి.శ్రీనివాస్, సీఐలు ఎం.కృష్ణ, రవీంద్రనాయక్, ఎస్సైలు జి.లింబాద్రి, ఎస్‌.శ్రీకాంత్, గోపి, గణేష్, అశోక్, దర్యాప్తు బృందాన్ని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement