వివేకా హత్య కేసులో సునీత తీరును తప్పుబట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు
కోర్టు ఆదేశాలతో సీబీఐ అదనపు దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించింది
మరోసారి దర్యాప్తునకు ఆదేశిస్తే ట్రయల్ మరింత ఆలస్యం..
ఈ కేసులో వేగవంతమైన విచారణ జరపాలని ఇప్పటికే ‘సుప్రీం’ ఆదేశించింది
క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు నిరంతరం కొనసాగుతూ ఉండలేదంటూ తీర్పు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత పదేపదే పిటిషన్లు వేస్తూ విచారణను అడ్డుకోవటాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు తప్పుపట్టింది. ఇలాంటి పిటిషన్లతో ట్రయల్ మరింత ఆలస్యం అవుతుందని స్పష్టం చేసింది. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు నిరంతరం కొనసాగుతూ ఉండలేదని.. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు వేగవంతమైన విచారణ జరపాలని ఆదేశించిందని గుర్తు చేసింది. మరోసారి దర్యాప్తునకు ఆదేశిస్తే ట్రయల్ మరింత ఆలస్యమవుతుందని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది.
సీబీఐ చేపట్టిన దర్యాప్తుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మరింత దర్యాప్తు జరిపించాలని సునీత దాఖలు చేసిన పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని స్పష్టం చేస్తూ కొట్టివేసింది. ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఒకసారి అదనపు దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించిన విషయాన్ని గుర్తు చేసింది. సందేహాలతో అవే అంశాలపై మళ్లీ దర్యాప్తునకు ఆదేశాలివ్వడం చట్టపరంగా సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
దర్యాప్తు ఎలా సాగాలనే విషయాన్ని న్యాయస్థానం నిర్దేశించలేదని పేర్కొంటూ సునీత అభ్యర్థనను తిరస్కరించింది. సీబీఐ దర్యాప్తు సరిగా చేయలేదని, ఇటీవల దాఖలు చేసిన చార్జీషీట్ను అనుమతించవద్దంటూ ప్రత్యేక న్యాయస్థానంలో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ఉద్దేశాన్ని సీబీఐ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావు విచారణ చేపట్టారు. అన్ని పక్షాల నుంచి సుదీర్ఘ, సమగ్ర వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేసి.. శుక్రవారం వెల్లడించారు.
మళ్లీ దర్యాప్తు అనవసరం..
సీబీఐ తరఫున పీపీ వాదనలు వినిపిస్తూ.. గతంలో కోర్టు నిర్దేశించిన అంశాలన్నింటినీ పరిశీలించి అదనపు దర్యాప్తు పూర్తి చేశామని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో కాల్ డేటా, సందేశాల సమయాలను ధృవీకరించామన్నారు. మునుపు అర్ధరాత్రి పంపినట్లు భావించిన సందేశాలు వాస్తవానికి భారత కాలమానం ప్రకారం ఉదయం 7.12 గంటలకు పంపినవేనని సాంకేతికంగా నిర్ధారించామని వివరించారు.
అదనపు దర్యాప్తులో నలుగురు వ్యక్తులను విచారించామని, హత్యలో ఇతరుల ప్రమేయాన్ని సూచించే కొత్త ఆధారాలు ఏవీ లభించలేదని స్పష్టం చేశారు. అందువల్ల మరింత దర్యాప్తు అవసరం లేదని, ట్రయల్ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు పూర్తి చేసి మూడో సప్లిమెంటరీ తుది నివేదిక సమర్పించిన తర్వాత అదే అంశాలపై మళ్లీ దర్యాప్తు కోరడం చట్టబద్ధం కాదన్నారు.
అనుమానాలతో పదేపదే పిటిషన్లు..
నిందితుల తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే ఒకసారి కోర్టు ఆదేశాల మేరకు అదనపు దర్యాప్తు పూర్తయిందని, అదే అంశాలపై మరోసారి విచారణ కోరడం చట్టబద్ధం కాదన్నారు. తాజా మౌఖిక లేదా పత్ర ఆధారాలు లేకుండా.. కేవలం అనుమానాల ఆధారంగా పదేపదే దర్యాప్తునకు ఆదేశిస్తే అది రీ–ఇన్వెస్టిగేషన్ అవుతుందని, చట్టం అలాంటి ప్రక్రియను అనుమతించదని వాదించారు. సునీత ఇప్పటికే వివిధ కోర్టుల్లో ఒకే అంశంపై పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారని, ఒకవైపు రోజువారీ విచారణ జరపాలని కోరుతూ, మరోవైపు పదేపదే కొత్త పిటిషన్లతో ట్రయల్ ఆలస్యం చేస్తున్నారన్నారు.
బాధితురాలికి దర్యాప్తు సంస్థపై పర్యవేక్షణ చేసే హక్కు లేదని, వ్యక్తిగత అభిప్రాయాలను అధికారులపై రుద్దలేరని వాదించారు. అన్ని పక్షాల నుంచి సమగ్ర వాదనలు విన్న న్యాయమూర్తి.. దర్యాప్తు సంస్థ ఎలా విచారణ జరపాలి, ఎవరిని ఎలా ప్రశ్నించాలి, ఏ అంశాన్ని ఎలా నిర్ధారించాలనే విషయాలను తాము నిర్దేశించలేమని తేల్చిచెప్పారు. సందేహాలు మాత్రమే అదనపు దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వడానికి సరిపోవన్నారు. ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు ఒకసారి అదనపు దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో, అదే అంశాలపై మళ్లీ విచారణ కోరడానికి చట్టం అవకాశం ఇవ్వదని స్పష్టం చేశారు. పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదంటూ సునీత పిటిషన్ కొట్టివేశారు.
తీర్పులో పేర్కొన్న కీలక అంశాలివీ..
1). ఇప్పటికే అదనపు దర్యాప్తు..
ఈ కేసులో గతంలోనే కోర్టు సెక్షన్ 173(8) సీఆర్పీసీ కింద పరిమిత అంశాలపై అదనపు దర్యాప్తునకు సీబీఐని ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేస్తూ సీబీఐ మూడో సప్లిమెంటరీ నివేదిక దాఖలు చేసినందున అదే అంశాలపై మరోసారి అదనపు దర్యాప్తు కోరడం చట్టపరంగా నిలబడదు.
2. ఇది చట్టబద్ధమైన ‘ప్రొటెస్ట్’ కాదు
సునీత ఈ పిటిషన్ను సెక్షన్లు 190, 200 సీఆర్పీసీ కింద దాఖలు చేసినా, కొత్త నేరాలపై కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవాలని కోరలేదు. ఆమె స్వయంగా సాక్ష్యమివ్వలేదు. సాక్షుల జాబితాను కూడా సమర్పించలేదు. దీనిని ప్రైవేట్ కంప్లైంట్ లేదా ప్రొటెస్ట్ పిటిషన్గా పరిగణించలేం.
3. కొత్త ఆధారాలు లేవు
గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ విచారణ నిర్వహించిన తర్వాత కొత్త నిందితులు, కొత్త సాక్ష్యాలు లేదా కొత్త ఆధారాలు వెలుగులోకి రాలేదు. కొత్త మెటీరియల్ లేకుండా మరోసారి దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరం లేదు.
4. మరింత దర్యాప్తు పేరిట రీ–ఇన్వెస్టిగేషన్..
ఇప్పటికే పరిశీలించిన కాల్ డేటా, సాక్షుల వాంగ్మూలాలు, సందేశాలను మరో కోణంలో మళ్లీ పరిశీలించాలని ఆమె కోరుతున్నారు. ఇది వాస్తవానికి ‘ఫర్ధర్ ఇన్వెస్టిగేషన్’ కాకుండా ‘రీ–ఇన్వెస్టిగేషన్’ కోరినట్లే. అలాంటి ఆదేశాలు ఇవ్వడానికి ఈ కోర్టుకు అధికారం లేదు.
5. దర్యాప్తు ఎలా చేయాలో చెప్పలేం..
దర్యాప్తు సంస్థ స్వతంత్రంగా పని చేయాల్సి ఉంటుంది. ఏ సాక్షిని ఎలా విచారించాలి? ఏ కోణంలో దర్యాప్తు చేయాలి? ఎలాంటి నిర్ధారణకు రావాలనే విషయాలను కోర్టు నిర్దేశించలేదు. అలాంటి ఆదేశాలివ్వడం దర్యాప్తు సంస్థ అధికార పరిధిలో జోక్యం చేసుకున్నట్లవుతుంది.
6. గత ఆదేశాల పరిధిని విస్తరించలేం
గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు కిరణ్ యాదవ్, అర్జున్రెడ్డి మధ్య జరిగిన సందేశాల పరిశీలనకే పరిమితం. తాజా పిటిషన్ ద్వారా ఆ పరిధిని విస్తరించి మరిన్ని అంశాలపై విచారణ జరపాలని కోరడం సబబుకాదు.
7. నిరవధికంగా విచారణా..?
క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు నిరంతరం కొనసాగుతూ ఉండలేదు. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు వేగవంతమైన విచారణ జరపాలని ఆదేశించింది. మరోసారి దర్యాప్తు ఆదేశిస్తే ట్రయల్ మరింత ఆలస్యమవుతుంది.


