రాష్ట్రంలో ముగిసిన ‘సర్’ ఇంటింటి సర్వే
శుక్రవారం సాయంత్రానికి 44.71 లక్షల మంది ఓటర్ల తొలగింపు
తుది ముసాయిదాలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం
ఆగస్టు 30న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అనంతరం రాష్ట్రంలో 45 లక్షలకు పైగా ఓట్లు తొలిగే అవకాశం ఉందని ప్రాథమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూలై 24వతేదీ సాయంత్రం 4 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 44,71,523 మంది ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 4,16,27,694 ఓట్లలో ఇది 10.74 శాతమని తెలిపారు. ఎంతమంది ఓటర్లను తొలిగించారనే తుది గణాంకాలు ఆగస్టు 30న విడుదల చేసే ముసాయిదా జాబితాలో వెల్లడి కానుంది.
గడువు పెంచాక మరిన్ని ఓట్ల తొలగింపు
‘సర్’లో ప్రధాన ఘట్టమైన ఇంటింటి సర్వే శుక్రవారం రాత్రితో ముగిసింది. జూన్ 15న ప్రారంభమైన ఇంటింటి సర్వే జూలై 15తో ముగియాల్సి ఉన్నా అన్ని వైపుల నుంచి వచ్చిన అభ్యర్థనలతో జూలై 24 వరకు ఎన్నికల సంఘం పొడిగించిన సంగతి తెలిసిందే. జూలై 14 నాటికి ఎమ్యూనరేషన్ ఫారాలు అందచేయని ఓటర్ల సంఖ్య 39,81,399 కాగా, గడువు పెంచిన తర్వాత ఈ సంఖ్య 44,71,523కి చేరుకోవడం గమనార్హం. గడువు పెంచిన పది రోజుల్లో దాదాపుగా మరో ఐదు లక్షల ఓట్లను తొలగించారు. గడువు పెరిగిన తర్వాత మరింత మంది ఓటర్ల వివరాలను సేకరించకపోగా తొలగించే ఓటర్ల సంఖ్య పెరగడంపై రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.


