పండుగల పర్వానికి నాంది.. తొలి ఏకాదశి వైభవం! | Why Ekadashi is Dedicated to Lord Vishnu: The Untold Mythological Story | Sakshi
Sakshi News home page

పండుగల పర్వానికి నాంది.. తొలి ఏకాదశి వైభవం!

Jul 25 2026 7:34 AM | Updated on Jul 25 2026 7:34 AM

Why Ekadashi is Dedicated to Lord Vishnu: The Untold Mythological Story

సమస్త లోకాలను కంటికి రెప్పలా కాపాడే జగత్ప్రభువు, శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేందుకు మన సనాతన సంస్కృతిలో లభించిన అత్యంత దివ్యమైన పర్వదినం తొలి ఏకాదశి. అది ఈ రోజే(జూలై 25).. సంవత్సరంలో వచ్చే సమస్త ఏకాదశి వ్రతాలలో ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఈ పవిత్ర దినం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, భగవంతునికి భక్తునికి మధ్య ఉండే అచంచలమైన ప్రేమకు, ఆత్మ నిగ్రహానికి ప్రతీక. ఈ శుభ సందర్భాన, తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి? ఇది సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు ఎందుకు అంతగా నచ్చింది? దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం..

తొలి ఏకాదశి ప్రత్యేకత ఏమిటి?
హిందూ చంద్రమాన కేలండర్ ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే ‘తొలి ఏకాదశి’ లేదా ‘ప్రథమ ఏకాదశి’ అంటారు. దీనిని ‘శయనీ ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజే శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళతారని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉండే ఈ కాలాన్ని చాతుర్మాసంగా భావించి, భక్తులు ప్రత్యేక దీక్షలు, పూజలు ఆచరిస్తారు. తొలి ఏకాదశితోనే పండుగల పరంపర  ప్రారంభమవుతుంది. చాతుర్మాస దీక్షలతో మొదలయ్యే ఈ వేడుకలు, వరుస పర్వదినాలతో ఏడాది పొడవునా ఇళ్లలో సందడిని నింపుతాయి.

విష్ణువుకు ఎందుకు ప్రీతిపాత్రమైనది? 
పద్మపురాణంలో తెలిపిన కథనం ప్రకారం పూర్వం మురుడు అనే రాక్షసుడు దేవతలను, మునులను నానావిధాలుగా ఇబ్బంది పెట్టాడు. ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ఆ రాక్షసుడి దాటికి తట్టుకోలేక శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. దేవతల రక్షణార్థం విష్ణువు ఆ రాక్షసుడితో సుదీర్ఘకాలం భీకరంగా యుద్ధం చేశాడు.దీంతో అలసిపోయిన మహావిష్ణువు బదరికావనంలోని ‘హేమవతి’ అనే గుహలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి (యోగానిద్రలోకి) ఉపక్రమించారు. అదే సమయాన్ని ఆసరాగా చేసుకుని, ఆ రాక్షసుడు నిద్రలో ఉన్న విష్ణువును అంతం చేయడానికి ముందుకు వచ్చాడు. ఆ అపాయాన్ని గమనించిన భగవానుని శరీరం నుండి ఒక దివ్యమైన, తేజోవంతమైన శక్తి ఉద్భవించింది. ఆ మహాశక్తి క్షణకాలంలోనే ఆ రాక్షసుడిని భస్మం చేసి అంతం చేసింది.  కనులు తెరిచి చూసిన మహావిష్ణువు జరిగిన సంఘటనను గ్రహించి, ఆ దివ్య స్త్రీ శక్తిపై ఎంతో సంతోషించాడు. ఆ రోజు పదకొండవ తిథి (ఏకాదశి) కావడంతో ఆ శక్తికి ‘ఏకాదశి’ అనే నామకరణం చేశాడు. అంతేకాకుండా, ‘ఎవరైతే ఈ పవిత్ర రోజున భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి నన్ను పూజిస్తారో, వారి సమస్త పాపాలను హరించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను’ అని ఆ దేవతకు వరం ఇచ్చారు. నాటి నుండి ఈ తిథి సాక్షాత్తు శ్రీహరికి అత్యంత ఇష్టమైనదిగా మారింది.

గొప్ప ఆధ్యాత్మిక శక్తి..
ఏకాదశిని కేవలం ఒక మామూలు ఉపవాస దినంగానే కాకుండా, హిందూ సంస్కృతిలో మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తారు. నెలలో రెండుసార్లు వచ్చే ఈ పర్వదినం వెనుక ఒక పౌరాణిక రహస్యం, గొప్ప ఆధ్యాత్మిక శక్తి దాగి ఉన్నాయి. హిందూ చంద్రమాన కేలండర్ ప్రకారం ప్రతి నెలలో వచ్చే పదకొండవ తిథినే ఏకాదశిగా పిలుస్తారు. ఇది శుక్ల పక్షం, కృష్ణ పక్షం రెండింటిలోనూ వస్తుంది. ఈ పవిత్రమైన రోజును సమస్త లోకాలను రక్షించే మహావిష్ణువుకు ఇష్టమైన రోజుగా భావిస్తారు.

ఆధునిక కాలంలో..
ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం అనేది కేవలం ఆహారం మానివేయడం మాత్రమే కాదు, అది మహావిష్ణువుకు తమను తాము పూర్తిగా సమర్పించుకోవడమే. ఇది మనసులోని కోరికలను అదుపులో ఉంచుకోవడానికి, ఆధ్యాత్మిక సాధనను మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది. ఈ వ్రతం చేయడం వల్ల గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉదయమే తలస్నానం చేసి, విష్ణువు ప్రతిమను పూలతో అలంకరిస్తారు. విష్ణు సహస్రనామం పఠిస్తూ, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపిస్తారు. నేటి ఉరుకులు పరుగుల ఆధునిక జీవితంలో ఏకాదశి ఉపవాసం మన శరీరానికి, మనసుకు ఒక చక్కటి విశ్రాంతిని ఇస్తుంది. ఇది శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మానసిక ప్రశాంతతను,క్రమశిక్షణను అలవాటు చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement