సాక్షి, చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారనే ఆరోపణల కేసులో మాజీ మంత్రి, డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ శుక్రవారం కోర్టులో లొంగిపోయారు. ఈ నెల 8న ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ లభించినప్పటికీ.. కోర్టు విధించిన షరతులు, విచారణ ప్రక్రియలో భాగంగా ఆయన న్యాయమూర్తి ముందు హాజరయ్యారు.
ఈ కేసులో సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్కు ఈ నెల 8న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.కె.ఇళందిరైయన్ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చారు. 15 రోజుల్లోగా చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో లొంగిపోయి రూ.25 వేల సొంత పూచీకత్తులు, ఇద్దరి ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించారు.
ఈ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సెంథిల్ బాలాజీ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో లొంగిపోయి పూచీకత్తు పత్రాలను సమర్పించారు. దీంతో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కార్తికేయన్ బెయిల్ మంజూరు చేసి, శనివారం నుంచి విచారణాధికారి ముందు హాజరై సంతకం చేయడానికి అనుమతించారు. అశోక్ కుమార్ మరో కేసు నిమిత్తం కరూర్లో ఉండడంతో, ఆయన సోమవారం కోర్టులో లొంగిపోనున్నట్లు సమాచారం.


