వాషింగ్టన్: అమెరికా-సౌదీ అరేబియా మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందంపై ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణీకరిస్తేనే ఈ ఒప్పందం అమలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అబ్రహాం ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియా ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించాలని ఆయన షరతు విధించారు. ఈ అనూహ్య నిర్ణయంపై సర్వత్రా చర్చనీయాంశమవుతుండగా, వైట్హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ దీనిని గట్టిగా సమర్థించారు.
సౌదీ అరేబియా మనస్తత్వాన్ని, అక్కడి నాయకుల విధానాలను ట్రంప్ అద్భుతంగా అర్థం చేసుకున్నారని మిల్లర్ తెలిపారు. ‘అమెరికాలో మరే ఇతర నాయకుడికన్నా ట్రంప్కు సౌదీ మనస్తత్వంపై సంపూర్ణ అవగాహన ఉంది. ఆయన నిర్ణయాలపై ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా నమ్మకం ఉంచాలి’ అని ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్, రియాద్ దేశాలు అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేసిన మరునాడే ట్రంప్ ఈ కొత్త షరతును తెరపైకి తేవడం గమనార్హం.
మరోవైపు పాలస్తీనా సమస్యకు స్పష్టమైన పరిష్కారం లభించే వరకు ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు నెరకొనే ప్రసక్తే లేదని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. ప్రస్తుత పరిణామాలపై సౌదీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని సమాచారం. ఈ తాజా పరిణామం మధ్యప్రాచ్య రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అణు ఒప్పందం అమలు కావాలంటే అమెరికా కాంగ్రెస్ ఆమోదం కూడా తప్పనిసరి కావడంతో, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: ఇరాన్ డేంజర్ ప్లాన్.. అమెరికా సంచలన నివేదిక!


