అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా ఆదేశాలు
ముగిసిన తాత్కాలిక సుంకాల గడువు
అరవై భాగస్వామ్య దేశాలపైనా కొత్త టారిఫ్లు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా మరోసారి భారత్పై టారిఫ్ల కొరడా ఝళిపించింది. బలవంతపు చాకిరితో వచ్చిన ఉత్పత్తులను నియంత్రించే లక్ష్యంతోనే ఈ టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించింది. తాజా ఆదేశాలతో అమెరికా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 99 శాతం వస్తువులపై పది నుంచి 12.5 శాతం టారిఫ్ వర్తిస్తుంది. బలవంతపు చాకిరి ద్వారా వచ్చిన ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తూ చట్టసవరణలు చేసిన కారణంగా భారత్పై పది శాతం పన్ను మాత్రమే విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు.
వాణిజ్య సంస్థల ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ భారత్ లాంటి దేశాలను మరింత ప్రోత్సహించేందుకు పది శాతం టారిఫ్ విధించాలని వాణిజ్య సంస్థల ప్రతినిధులు సూచించారని తెలిపారు. కొత్త టారిఫ్లు మొత్తం అరవై దేశాల దిగుమతులకు వర్తిస్తాయని, బలవంతపు చాకిరితో ఉత్పత్తి అయిన వస్తువుల ఎగుమతులపై నిషేధం లేని చైనా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్లతోపాటు మొత్తం 43 దేశాలకు 12.5 శాతం, మిగిలిన దేశాలపై 10 శాతం టారిఫ్లు వర్తిస్తాయని వాణిజ్య సంస్థల ప్రతినిధి జేమిస్ గ్రీర్ తెలిపారు. కొత్త టారిఫ్లు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి తరువాత అమల్లోకి రానున్నాయి.


