బందీలుగా ఉన్న యువకులు
సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగమని చెప్పి తెలుగు యువతకు గాలం
తొలుత కంబోడియా.. ఆపై అక్కడి నుంచి మయన్మార్కు తరలింపు
సైబర్ నేరాలకు బలవంతం చేస్తున్న ముఠాలు
ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయకపోతే చిత్రహింసలు, విద్యుత్ షాక్లు
మహిళలకు లైంగిక వేధింపులు
18 గంటల పని.. రోజుకు ఒక్కపూటే భోజనం
నేరగాళ్ల ఘోరాలపై బందీలు రహస్యంగా సమాచారం పంపిన వైనం
ప్రభుత్వాలు జోక్యం చేసుకుని స్వదేశానికి తీసుకురావాలని కుటుంబాల విజ్ఞప్తి
తాడేపల్లి రూరల్: తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులను సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, చివరకు కంబోడియా మీదుగా మయన్మార్కు తరలించి సైబర్ నేరాలకు బలవంతం చేస్తున్న అంతర్జాతీయ ముఠా వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన సుమారు 300 మంది యువతీ యువకులు ప్రస్తుతం మయన్మార్లో బందీలుగా ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, సామాజిక మాధ్యమాల ద్వారా సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయంటూ ప్రచారం నిర్వహించిన కొందరు వ్యక్తులు యువతను ఆకర్షించారు. ఉద్యోగాల కోసం వచ్చిన వారిని ముందుగా కోల్కతాకు, అక్కడి నుంచి కంబోడియాకు తరలించారు. కంబోడియా చేరుకున్న వెంటనే వారి పాస్పోర్టులు, మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు.
ఏప్రిల్ 2న ఇంటి నుంచి బయలుదేరిన బాధితులు
తాడేపల్లి రూరల్ మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన సాయిబాబా, కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన పూర్ణ వెంకట కృష్ణ, ప్రకాశం జిల్లా కదిరికి చెందిన భాను, మేదరమెట్లకు చెందిన రితీష్ కుమార్తో పాటు మరికొందరు యువకులు ఏప్రిల్ 2న సింగపూర్కు ఉద్యోగాల కోసం వెళ్తున్నామని కుటుంబ సభ్యులకు చెప్పి కోల్కతాకు వెళ్లారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తుల సూచనల మేరకు కంబోడియా మీదుగా మయన్మార్కు చేరుకున్నారు. మయన్మార్లోని కొండ ప్రాంతంలో ఉన్న ఓ సంస్థలో వీరిని సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రారంభంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ, అనంతరం వారిని మరో కంపెనీకి తరలించారు. దాదాపు 300 మందిని ఒకేసారి వేరే కేంద్రానికి మార్చినట్లు సమాచారం. అక్కడ యువతకు రోజువారీ టార్గెట్లు విధించి, వాటిని పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. లక్ష్యాలను చేరుకోలేకపోతే తీవ్ర చిత్రహింసలకు గురిచేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఎదురు తిరిగిన వారిని డార్క్రూమ్లలో నిర్బంధించి విద్యుత్ షాక్లు ఇస్తున్నట్లు సమాచారం.

పారిపోయిన 50 మంది.. ఆచూకీ గల్లంతు
ఈ పరిస్థితులను భరించలేక సుమారు 50 మంది యువకులు జూలై 15న అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. అదే రోజు ఉదయం 7.30 గంటల సమయంలో కంబోడియా కోడ్తో ఉన్న ఫోన్ నంబర్ నుంచి ఒకరు వడ్డేశ్వరానికి చెందిన సాయిరామ్కు కాల్ చేసి తమ పరిస్థితిని వివరించారు. అయితే ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. కాగా, మయన్మార్లోనే ఉన్న సాయిబాబా ఇటీవల తన చెల్లికి స్నేహితుల ద్వారా వాయిస్ మెసేజ్ పంపి క్షేమంగా ఉన్నామని తెలిపాడు. మరో బాధితుడు పూర్ణ వెంకట కృష్ణ తన స్నేహితులతో అప్పుడప్పుడు వాట్సాప్ ద్వారా మాట్లాడుతున్నాడు.
అతను తెలిపిన సమాచారం ప్రకారం అక్కడ ఉన్న వారిని రోజుకు 18 గంటలపాటు కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి పని చేయిస్తున్నారు. రోజుకు ఒక్కసారి మాత్రమే ఆహారం ఇస్తున్నారు. బయటకు రావాలంటే రూ.15 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మగవారిని చిత్రహింసలకు గురిచేస్తుంటే, మహిళలను లైంగిక దోపిడీకి గురిచేస్తున్నారు. వీరందరూ ఒక కొండ ప్రాంతంలో ఉన్నారు. చుట్టూ సుమారు 30 మీటర్ల ఎత్తైన గోడలు నిర్మించారు.
గోడలపై విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా, చుట్టూ కాలువలు తవ్వి వాటికీ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. రాష్ట్రంలోని దాదాపు ప్రతి జిల్లా నుంచి 5 నుంచి 6 మంది చొప్పున యువతీ యువకులు మయన్మార్లో ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు. అక్కడి అకృత్యాలకు సంబంధించిన చిత్రాలను పూర్ణ వెంకట కృష్ణ పంపారు.
ఫిర్యాదు చేసినా.. స్పందన శూన్యం
ఈ ఘటనపై సాయిబాబా స్నేహితులు సాయిరామ్తో కలిసి జూలై 15న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)కు ఫిర్యాదు చేశారు. అనంతరం జూలై 22న ఏపీ ఎన్ఆర్టీలో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ, నార్త్జోన్ డీఎస్పీ, తాడేపల్లి సీఐలకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించకపోవడంతో బాధితుల కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులను వెంటనే గుర్తించి స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


