న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో యువత, కొత్త తరంతో వ్యవహరించే విధానంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘విశ్వ మంగళ్య సభ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులను, యువత ఆలోచనా విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తాము యువకులుగా ఉన్న కాలం పూర్తిగా విధేయతతో కూడుకున్నదని, కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ప్రస్తుత కొత్త తరం ప్రతి అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని, వారికి కేవలం ఆదేశాలు ఇవ్వడం కాకుండా తగిన కారణాలు వివరించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. నేటి కుటుంబాల్లోనూ పరస్పర సంభాషణలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలతో మరింత ఆప్యాయంగా మెలగాలని, వారి కోసం సమయం కేటాయించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు.
ఇదేసమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ స్పష్టం చేశారు. నూతన సాంకేతికతలను అందిపుచ్చుకుని, వాటిపై పట్టు సాధించి, మానవాళి అభ్యున్నతికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. భౌతికవాద ఆలోచనల కారణంగా సృజనకు పరిమితంగా ఉన్న వనరులు, అపరిమిత ఆకాంక్షల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోటీ కారణంగానే సమాజంలో సంఘర్షణలు తలెత్తుతున్నాయని మోహన్ భగవత్ విశ్లేషించారు.
ఇది కూడా చదవండి: ‘జంతర్ మంతర్’ ఎఫెక్ట్: మందుబాబులకు షాక్!


