కేంద్ర మంత్రికీ తప్పని డీప్‌ఫేక్ సెగ! | AI Generated Deepfake Video Falsely Showed Union Minister Piyush Goyal Sparks Cybercrime Probe, PIB Fact Check Inside | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రికీ తప్పని డీప్‌ఫేక్ సెగ!

Jul 25 2026 9:23 AM | Updated on Jul 25 2026 10:01 AM

AI generated deepfake video falsely showed Union Minister PIB fact check

ఏఐ ప్రయోజనకరమైన సాంకేతికతగా ఎదుగుతున్నట్లే, సామాజిక స్థిరత్వానికి, ప్రజాస్వామ్య వ్యవస్థలకు తీవ్ర సవాలుగా మారుతోంది. తాజాగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ లక్ష్యంగా రూపుదిద్దుకున్న డీప్‌ఫేక్ వీడియో ఉదంతం దేశంలో డిజిటల్ దుష్ప్రచారం ఏ స్థాయిలో విస్తరిస్తుందో స్పష్టం చేస్తోంది. సమాజంలో గందరగోళం సృష్టించేందుకు తన ముఖం, గొంతును మార్ఫింగ్ చేస్తూ రూపొందించిన నకిలీ వీడియోపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని చాణక్యపురి పోలీసు స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), సమాచార సాంకేతిక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

విచారణలోని అంశాలు

మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అసలు వీడియో దృశ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా మార్ఫింగ్ చేసి ఆయన విరుద్ధమైన వ్యాఖ్యలు చేసినట్లుగా ఈ ఫేక్ వీడియోను సృష్టించినట్లు ఫిర్యాదులో తెలిపారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిగా నకిలీదిగా ధ్రువీకరించింది. విద్యార్థుల నిరసనలకు సంబంధించి గోయల్ బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్లు చూపుతున్న ఈ డీప్‌ఫేక్ కంటెంట్‌ను విదేశీ ఆన్‌లైన్ నెట్‌వర్క్‌లు, ముఖ్యంగా పాకిస్థాన్‌ మద్దతుగల సోషల్ మీడియా ఖాతాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ప్రభుత్వం స్పందన.. సైబర్ భద్రత

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పీయూష్ గోయల్ ‘ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేయడాన్ని ప్రభుత్వం ఎంతమాత్రం సహించదు’ అని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌ ద్వారా స్పష్టం చేశారు. ఈ కుట్ర వెనుక ఉన్న సూత్రధారులు, దీన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

డిజిటల్ యుగంలో ఇటువంటి అబద్ధపు ప్రచారాలను నిరోధించేందుకు పౌరులు సైతం అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ఆధారాలు లేని ఏ సమాచారాన్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దని పీఐబీ విజ్ఞప్తి చేసింది. సైబర్ నేరగాళ్లు, విదేశీ శక్తులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఆయుధంగా మార్చుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏఐ నియంత్రణ నిబంధనలు, సైబర్ సెక్యూరిటీ చట్టాలను మరింత కఠినతరం చేసే దిశగా వేగంగా అడుగులు వేయాల్సి ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: ‘జాదూగర్’ ఆటకట్టించిన సెబీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement