యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఫ్రంట్ రన్నింగ్ కుంభకోణంలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలకమైన ఉత్తర్వులను వెలువరించింది. ఈ అక్రమాలకు ప్రధాన సూత్రధారి అయిన యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మాజీ చీఫ్ డీలర్ వీరేష్ జోషితో పాటు దుబాయ్కి చెందిన ప్రధాన ట్రేడర్ ప్రిజేష్ కురానీలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఏడేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
రూ.30.56 కోట్ల అక్రమ లాభాల జప్తు
ఈ కుంభకోణం ద్వారా ఆర్జించిన రూ.30.56 కోట్ల అక్రమ లాభాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సెబీ ఆ మొత్తాన్ని ‘ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్’కి తరలించాలని ఆదేశించింది. దీనికి అదనంగా దర్యాప్తు కాలం ముగిసిన నాటి నుంచి డిపాజిట్ చేసే తేదీ వరకు సంవత్సరానికి 12 శాతం చొప్పున వడ్డీని కూడా జరిమానాగా చెల్లించాలని స్పష్టం చేసింది.
అసలు వివాదం ఏమిటి?
సాధారణంగా మ్యూచువల్ ఫండ్ సంస్థలు (యాక్సిస్ వంటివి) మార్కెట్లో ఏదైనా ఒక కంపెనీ షేర్లను వేల కోట్లలో కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి సిద్ధమైనప్పుడు ఆ షేరు ధర మార్కెట్లో ఒక్కసారిగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఈ సమాచారం బయటకు రాకముందు అత్యంత రహస్యంగా ఉంటుంది.
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మాజీ చీఫ్ డీలర్ వీరేష్ జోషి తన వద్ద ఉన్న ఈ రహస్య ట్రేడింగ్ సమాచారాన్ని ఆసరాగా చేసుకున్నాడు. యాక్సిస్ ఫండ్ మార్కెట్లో ఏ షేరును ఎంత పరిమాణంలో కొనుగోలు చేయబోతుందో లేదా అమ్మబోతుందో వీరేష్ జోషి ముందే తెలుసుకునేవాడు. ఈ ముందస్తు సమాచారాన్ని దుబాయ్లో ఉన్న ప్రధాన ట్రేడర్ ప్రిజేష్ కురానీకి చేరవేసేవాడు (ఈ చాటింగ్లలో జోషిని ‘జాదూగర్’ అని పిలిచేవారు). యాక్సిస్ ఫండ్ తన భారీ ఆర్డర్ను మార్కెట్లో పెట్టడానికి కొద్ది నిమిషాల ముందే కురానీ తన వద్ద ఉన్న బినామీ/బోగస్ ఖాతాల ద్వారా ఆ షేర్లను తక్కువ ధరకు కొనేసేవాడు. ఆ వెంటనే యాక్సిస్ ఫండ్ భారీ ఆర్డర్ మార్కెట్లోకి రాగానే షేరు ధర పెరిగేది. అప్పుడు కురానీ ముందే కొన్న షేర్లను అధిక ధరకు యాక్సిస్ ఫండ్కే (లేదా మార్కెట్లో) అమ్మేసి రూ.కోట్లలో లాభాలు గడించేవాడు. సెబీ జరిపిన సమగ్ర విచారణలో సెప్టెంబర్ 1, 2021 నుంచి మార్చి 31, 2022 మధ్యకాలంలో ఈ అక్రమాలు సాగినట్లు తేలింది.
సిండికేట్పై కఠిన చర్యలు
వాట్సాప్ చాట్లు, ట్రేడ్ లాగ్లు, కాల్ రికార్డుల ఆధారంగా సెబీ ఈ బినామీ వ్యవస్థను ఛేదించింది. తీవ్రతను బట్టి నెట్వర్క్లోని మిగిలిన భాగస్వాములపై విభిన్న నిషేధాలు విధించింది.
7 ఏళ్ల నిషేధం: వీరేష్ జోషి, ప్రిజేష్ కురానీతో పాటు ధరిణి కురానీ, రేఖా కురానీ, భారతి గొడాయా సహా ఏడుగురు.
5 ఏళ్ల నిషేధం: బినామీ ఖాతాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన సుమిత్ దేశాయ్, ప్రణవ్ వోరా.
3 ఏళ్ల నిషేధం: వైభవ్ పాండ్యా, నిశిల్ మార్ఫాటియా, ఆల్గా ట్రేడింగ్, వీసా క్యాపిటల్ పార్టనర్స్ సహా మరో 12 మంది వ్యక్తులు, సంస్థలపై.
సాధారణ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్పై ఉంచిన నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ సాగించిన ఈ కార్పొరేట్ అక్రమాన్ని సెబీ నిరోధించిన తీరు మార్కెట్ పారదర్శకతకు, ఇన్వెస్టర్ల విశ్వాస పునరుద్ధరణకు దారితీస్తుంది. ఇన్సైడర్ ట్రేడింగ్, ఫ్రంట్ రన్నింగ్ లాంటి అక్రమాలకు పాల్పడే ఏ శక్తికీ మార్కెట్లో చోటు లేదని సెబీ ఈ తీర్పు ద్వారా స్పష్టమైన హెచ్చరిక పంపింది.
ఇదీ చదవండి: ఎగుమతులకు రెక్కలొచ్చేనా?


