దేశీయ మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) తన ఉద్యోగుల సర్వీస్ నిబంధనలను మార్చేసింది. ప్రయోజనాల ఘర్షణ (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్) నివారణకు, పారదర్శకతను పెంచడానికి సరికొత్త ‘సెబీ (ఎంప్లాయీస్ సర్వీస్ అమెండ్మెంట్) రెగ్యులేషన్స్, 2026’ నిబంధనలను నోటిఫై చేసింది. ఈ కోడ్ ప్రకారం ఉద్యోగులు విధులను వీడిన తర్వాత పాటించాల్సిన నిబంధనలతో పాటు వారి వ్యక్తిగత పెట్టుబడులపై కూడా నిఘా ఉంచనున్నారు.
కీలక మార్పులు
సెబీ నుంచి రిటైర్ అయినా లేదా రాజీనామా చేసి తప్పుకున్నా.. ఆ తర్వాతి రెండేళ్ల వరకు సదరు మాజీ ఉద్యోగులు ఎలాంటి క్లయింట్ల తరఫున సెబీ ముందు హాజరు కాకూడదు. ఏదైనా కేసుల విచారణ, సెటిల్మెంట్లు లేదా అప్రూవల్స్ వంటి విషయాల్లో బోర్డు ముందు క్లయింట్ల పక్షాన వాదించడం లేదా ప్రాతినిధ్యం వహించడంపై పూర్తిగా నిషేధం విధించారు.
నిబంధనల అమలు కోసం ‘కుటుంబం, ఆధారపడిన వారు (డిపెండెంట్స్)’ అనే పదాల నిర్వచనాన్ని సెబీ మరింత విస్తరించింది. ఇకపై దత్తత తీసుకున్న పిల్లలు, సవతి పిల్లలతో పాటు ఉద్యోగిపై ఆర్థికంగా ఆధారపడే ప్రతి ఒక్కరూ ఈ పరిధిలోకి వస్తారు. దీనివల్ల ఉద్యోగుల కుటుంబ సభ్యుల పెట్టుబడుల డిక్లరేషన్ల పరిధి మరింత పెరగనుంది.
సెబీలో పని చేస్తూనే బయటి కార్పొరేట్ సంస్థలు లేదా ఇతర యజమానులతో ఉద్యోగ చర్చలు జరిపితే ఆ చర్చలు ప్రారంభించిన నెల రోజుల్లోగా బోర్డుకు డిజిటల్ రికార్డుల రూపంలో సమాచారం అందించడం తప్పనిసరి.
పెట్టుబడులపై కఠిన ఆంక్షలు
సెబీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మార్కెట్ సమాచారాన్ని ఉపయోగించుకుని వ్యక్తిగతంగా లాభపడకుండా ఉండేందుకు ఇన్వెస్ట్మెంట్లపై స్పష్టమైన నిఘా ఉంచారు.
ఉద్యోగ కాలంలో కొత్తగా షేర్లు, డెరివేటివ్స్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం పూర్తి నిషేధం.
మ్యూచువల్ ఫండ్స్, రీట్స్ వంటి నిపుణుల ద్వారా నిర్వహించే పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడులకు అనుమతి.
కొన్ని రకాల నియంత్రిత పెట్టుబడి సాధనాల్లో గరిష్టంగా మొత్తం పోర్ట్ఫోలియోలో 25 శాతానికి మించి పెట్టుబడి పెట్టకూడదు.
మినహాయింపులు: ఉద్యోగి జీవితభాగస్వామికి వారి సొంత ఆఫీస్ నుంచి లభించే ఈసాప్స్ (ESOPs), డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) వంటి పరిమిత అంశాలకు మాత్రమే కొన్ని మినహాయింపులు ఇచ్చారు.
ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం..


