అయోధ్య రామాలయంలో టెక్ అప్‌డేట్ | Ayodhya Ram Mandir: SIT Recommends AI Surveillance to Curb Donation Thefts | Sakshi
Sakshi News home page

అయోధ్య రామాలయంలో టెక్ అప్‌డేట్

Jul 13 2026 12:25 PM | Updated on Jul 13 2026 12:31 PM

ayodhya-ram-mandir-ai-surveillance-donation-security

జులై 15న యూపీ ప్రభుత్వానికి సిట్ తుది నివేదిక

ప్రతీ రూపాయిపై నిఘా ఉంచేలా ఏఐ సిఫార్సు

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆలయంలో విరాళాల లెక్కింపు, కానుకల నిర్వహణలో మరింత పారదర్శకతను పెంచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. విరాళాల చోరీలను, వాటి దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సిఫార్సు చేయనుంది. ఈ మేరకు జులై 15న యూపీ ప్రభుత్వానికి సమర్పించనున్న తన తుది నివేదికలో ఈ అంశాన్ని ప్రధానంగా చేర్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ప్రాథమిక నివేదికలో షాకింగ్ నిజాలు

రామమందిరంలో కానుకలు, నగదు మాయమవుతున్నాయనే ఫిర్యాదులపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సిట్‌ను ఏర్పాటు చేసింది. జూన్ 15 నుంచి రంగంలోకి దిగిన ఈ కమిటీ ఆలయ భద్రత, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. కాగా, జూన్ 23న సిట్ సమర్పించిన ప్రాథమిక నివేదికలో సంచలన నిజాలు బయటపడ్డాయి. కేవలం 40 రోజుల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణంలో ఏకంగా 70 సార్లు కానుకల చోరీ జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు బృందం నిర్ధారించింది.

ప్రతీ రూపాయిపై ఏఐ కన్ను!

ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవాలని సిట్ భావిస్తోంది. దీనికోసం సిఫార్సు చేయనున్న ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థ ప్రధానంగా కొన్ని అంశాలపై పనిచేయనుంది.

హుండీ నిర్వహణ - పారదర్శకత: భక్తులు సమర్పించే నగదు, విలువైన వస్తువుల సేకరణ నుంచి భద్రపరిచే వరకు ప్రతి దశను ఏఐ కెమెరాలు నిశితంగా పరిశీలిస్తాయి.

కౌంటింగ్ ప్రక్రియపై ప్రత్యేక నిఘా: విరాళాల లెక్కింపు సమయంలో జరిగే అనుమానాస్పద కదలికలను, చేతివాటాన్ని ఈ వ్యవస్థ తక్షణమే పసిగట్టి అధికారులను అలర్ట్ చేస్తుంది.

అనుమానితుల గుర్తింపు: ఆలయ పరిసరాల్లో పదే పదే తిరిగే వ్యక్తులు లేదా అనుమానాస్పద ప్రవర్తన కలిగిన వారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందే గుర్తించి భద్రతా సిబ్బందికి సమాచారం అందిస్తుంది.

త్వరలోనే సిట్ తుది పరిశీలన

తుది నివేదిక సమర్పణకు ముందు సిట్ సభ్యులు మరోసారి అయోధ్యను సందర్శించనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులతో పాటు ఆలయ విరాళాల నిర్వహణ సిబ్బందిని అదనపు రికార్డుల ఆధారంగా ప్రశ్నించనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రస్ట్ సైతం తమ అంతర్గత విరాళాల సేకరణ, లెక్కింపు విధానాలను పునసమీక్షించే పనిలో పడింది. ప్రపంచవ్యాప్త భక్తుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న అయోధ్య రామాలయంలో ప్రతీ రూపాయి భద్రంగా ఉండేలా చూసేందుకు అక్కడి ప్రభుత్వం ఈ మెగా టెక్ అప్‌డేట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement