15 ఏళ్లకే చదువుకి మానేసింది..! కట్‌చేస్తే రూ 7 వేల కోట్ల కంపెనీ.. | How Harshita Arora went from Saharanpur to Silicon Valley | Sakshi
Sakshi News home page

15 ఏళ్లకే చదువుకి మానేసింది..! కట్‌చేస్తే రూ 7 వేల కోట్ల కంపెనీ..

Jul 13 2026 12:32 PM | Updated on Jul 13 2026 1:22 PM

How Harshita Arora went from Saharanpur to Silicon Valley

సాధారణంగా కష్టపడి చదివి..నైపుణ్యాలు అందిపుచ్చుకుని ఒక్కోమెట్టు ఎక్కుతూ సక్సెస్‌ అందుకుంటాం. కానీ కొందరు చిన్న వయసులోనే అపార ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ కోవకు చెందిన పిల్లలు అందరి పిల్లల్లా క్లాస్‌రూమ్‌ పాఠాలకు అంకితమవ్వరు. అలా టైం వేస్ట్‌ చేసే కంటే..తనకేది ఇష్టమే ఏం చేస్తే బాగుంటుందో.. అంత చిన్న వయసులోనే నిర్ణయించుకోగలరు. ఆ దిశగా తమ టాలెంట్‌ని ప్రదర్శించి దిగ్గజ కంపెనీలే వచ్చి తమ సంస్థలో చేర్చుకునేలా చేసుకుంటారు. అలాంటి టాలెంటెడ్‌ గర్ల్‌ హర్షిత అరోరా. ఆమె స్కూల్‌ చదువుని మధ్యలోనే ఆపేసి పేరెంట్స్‌కి షాక్‌ ఇచ్చింది. ఆ తర్వాత అత్యంత చిన్న వయసులోనే కోట్ల విలువ చేసే కంపెనీని నిర్మించి..ఇంటెలిజెన్స్‌కి కేరాఫ్‌గా నిలిచింది. 

ఆ అమ్మాయే ఉత్తప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌ నగరానికి చెందిన హర్షిత అరోరా. చాలామంది పేరెంట్స్‌ తమ పిల్లలు ఇంజీనర్‌ లేదా డాక్టరో అవ్వాలనే అనుకుంటారు. కానీ హర్షిత తన తల్లిదండ్రులే ఆందోళన చెందేలా భయానక నిర్ణయం తీసుకుని షాక్‌కి గురి చేసింది. చదువుకి అత్యంత కీలకమైన టీనేజ్‌ దశ అంటే 15 ఏళ్ల వయసుకే ఈ చదువులు నావల్ల అయ్యే పని కాదని స్టడీస్‌కి బై..బై చెప్పేసింది. తనకు తాను సొంతంగా టెక్నాలజీ గురించి నేర్చుకోవడం ప్రారంభించింది. 

ఒక కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ సాయంతో 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒక క్రిప్టో పోర్ట్‌ఫోలియో ట్రాకింగ్ యాప్‌ను సృష్టించింది. అది చాలా సరళంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. ఆపిల్‌ దీన్ని గమనించి తన ఫ్లాట్‌ఫామ్‌లోకి చేర్చింది. ఈ యాప్ అమెరికా, కెనడా దేశాల వ్యాప్తంగా రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన ఫైనాన్స్ యాప్‌గా నిలిచింది. ఆ తర్వాత కొద్ది కాలానికే, ఒక కంపెనీ దీనిని కొనుగోలు చేసింది. అలా 2020లో, భారత ప్రభుత్వం హర్షిత విజయాలను గుర్తించింది. అందుకుగానూ ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాల పురస్కార్‌ను అందుకుంది కూడా. 

అదే ఏడాది ఆమె అమెరికా వెళ్లడానికి O-1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. తమ రంగంలో అసాధారణమైన సామర్థ్యాన్ని ప్రదర్శించిన వారికి ఈ వీసా ఇస్తారు. అందుకోసం ఆమెకు మొత్తం పదిమంది సీఈవోల నుంచి సిఫార్సులు అవసరం. కానీ హర్షితకు ఏకంగా 15 సిఫార్సులు లభించాయి. అంతేగాదు శాన్ ఫ్రాన్సిస్కో ఆమెకు స్వాగతం పలికింది. 2019లో, ఆమె విజ్ఞాన్ వెలివేల మరియు తుషార్ మిశ్రాలతో కలిసి AtoB అనే స్టార్టప్‌ను స్థాపించారు. వాళ్ల మంచి ఆలోచనతో స్టార్టప్‌ని ప్రారంభించడంతో Y కాంబినేటర్ సమ్మర్ 2020 బ్యాచ్‌కు ఎంపికయ్యారు.ఈ Y కాంబినేటర్ (Y Combinator) అనేది 2005లో స్థాపించిన ఒక ప్రముఖ అమెరికన్ స్టార్టప్ యాక్సిలరేటర్. ఇది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి (స్టార్టప్‌లకు) అవసరమైన ప్రాథమిక పెట్టుబడి (Seed Fund), శిక్షణను అందిస్తుంది. 

అయితే వారి ఆలోచన ప్రారంభం కాకముందే కరోనా మహమ్మారితో వారి స్టార్టప్‌కి బ్రేక్‌లు పడ్డాయి. అకస్మాత్తుగా మారిపోయిన ప్రపంచం ఒకవైపు..ఏదో నిర్మించాలనే తపనతో కష్టపడుతున్న హర్షిత బృందం ఇంకోవైపు. నిజానికి ఆ టైంలో చాలా స్టార్టప్‌లు మూతపడ్డాయి. చాలామంది వ్యవస్థాపకులు తిరిగి ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు కూడా. అయితే హర్షిత బృందం మాత్రం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ట్రంక్‌ స్టాప్‌లకు వెళ్లారు. వారాల తరబడి అక్కడే నిలబడి ఆ ట్రక్ డ్రైవర్లతో మాట్లాడేవారు. 

వారి సమస్యల గురించి, చెల్లింపుల గురించి అడిగారు. అలాగే ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. నిజానికి హర్షిత బృందానికి ట్రక్కింగ్ పరిశ్రమ గురించి ఏమీ తెలియదు. దానికి సంబంధించి..ఫ్లీట్‌ల కోసం చెల్లింపు వ్యవస్థల గురించి కూడా ఏమీ తెలియదు. వాళ్లకు అర్థమయ్యే వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంది ఆ బృందం. అలా వారు AtoBని మళ్ళీ మొదటి నుండి నిర్మించారు. ఈసారి ఈసారి అమెరికన్ ట్రక్కింగ్ పరిశ్రమ కోసం ఆర్థిక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి..దశాబ్దాలుగా పాత పద్ధతులను ఉపయోగిస్తున్న పరిశ్రమ కోసం ఆధునిక టెక్నాలజీని అందించారు.

అలా ఇప్పుడు అమెరికాలోని 30 వేలకు పైగా ఫ్లీట్‌లు AtoBని ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ సుమారు $800 మిలియన్లు, అంటే దాదాపు రూ. 7,600 కోట్లు. ఇక్కడ హర్షిత చదువు మానేసి మరి..తనకు ఏ మాత్రం పరిచయంలోని పరిశ్రమలో భారీ విజయాన్ని అందుకోవడం విశేషం. ప్రారంభించాలనుకున్నా.. స్టార్టప్‌కు బ్రేకులు పడ్డాయోమో గానీ తనకు కాదని తన సక్సెస్‌తో నిరూపించింది. 

ఏప్రిల్ 2026లో, వై కాంబినేటర్ హర్షితను జనరల్ పార్టనర్‌గా పదోన్నతి కల్పించింది. అంతకుముందు ఏడాది ఆ సంస్థలో అత్యంత పిన్న వయస్కురాలైన విజిటింగ్‌ పార్టనర్‌గా ఉంటూ..ప్రారంభ దశలో ఉన్న వ్యవస్థాపకులకు ఒక కంపెనీని నిర్మించడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో సహాయపడింది. దాంతో హర్షిత 24 ఏళ్లకే ప్రపంచంలోని అత్యంత తెలివైన, అత్యంత ఆశావాదులైన బిల్డర్లతో పనిచేసే అవకాశం దక్కించుకుంది. 

ఇక్కడ ఆమె ఏ స్టార్టప్‌లకు నిధులు అందాలో, ఏ వ్యవస్థాపకులకు ప్రపంచాన్ని మార్చే అవకాశం లభించాలో హర్షితానే నిర్ణయిస్తుంది. కెరీర్‌ ప్రారంభించే వయసుకే వై కాంబినేటర్‌లో జనరల్ పార్టనర్ అవ్వడం అంటే మామలు విషయం కాదు. ఎవ్వరికైన ఏదైనా మొదలు పెట్టేటప్పుడూ ఆటంకాలు వస్తాయి..దాన్ని అధిగమించి ఎలా ముందుకు సాగుతున్నావనే దానిపై సక్సెస్‌ మొత్తం ఆధారపడి ఉంటుందని హర్షిత నిరూపించింది. 

(చదవండి: పింక్‌ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement