అయోధ్య రామాలయం విరాళాల వివాదానికి సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విరాళాల చోరీ కేసు పై విచారణలో సుప్రీం ప్రతి వాదులకు నోటీసులు జారీచేసింది. అలాగే సిట్ దర్యాప్తు స్టేటస్ రిపోర్టు ఫైల్ చేయాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదావేసింది. విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్ ద్వారా దర్యాప్తు జరుపుతోందని కోర్టుకు తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.
అయోధ్య రాముడి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ (CBI) స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను (PILs) సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు పునఃప్రారంభమైన మొదటి రోజే ఈ కీలకమైన కేసు విచారణకు రావడం గమనార్హం.
రామాలయ నిర్మాణం కోసం సేకరించిన ప్రజా విరాళాలను దుర్వినియోగం చేశారని, నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ న్యాయవాదులు, ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ సహా మరికొందరు వేర్వేరుగా ఈ పిటిషన్లను దాఖలు చేశారు. ఇందులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరుపుతోంది.
అయితే, సంక్లిష్టమైన ఆర్థిక నేరాలను దర్యాప్తు చేయడానికి అవసరమైన ఫోరెన్సిక్ మరియు తగిన వనరులు రాష్ట్ర సిట్ (SIT) వద్ద లేవని, పైగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే దర్యాప్తు ప్రారంభించారని పిటిషనర్లు వాదన.దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయం కావడంతో, దీనిపై సీబీఐ నేతృత్వంలో నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని, అలాగే ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలపై కాగ్ (CAG) లేదా స్వతంత్ర సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని కూడా కోరారు.
ఇదీ చదవండి: 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?


