సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్య
గురుగ్రామ్: కేసుల స్వభావంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ కూడా పరిణామం చెందాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. ఆయన ఆదివారం గురుగ్రామ్లో ‘టవర్ ఆఫ్ జస్టిస్’జ్యుడీషియల్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. ఇది ప్రజలకు న్యాయం చేకూర్చడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తుందని అన్నారు. ఏడు ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ న్యాయ సౌధం ప్రతి పౌరుడికీ న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ మాట్లాడారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. న్యాయ వ్యవస్థను సమర్థవంతంగా, పౌర–కేంద్రితంగా మార్చడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. న్యాయ వ్యవస్థలో ఈ–కోర్టులు, ఈ–ఫైలింగ్, ఈ–ప్రాసిక్యూషన్, ఈ–ప్రిజన్స్, ఈ–ఫోరెన్సిక్స్, ఈ–సేవా కేంద్రాలు, డిజిటల్ చెల్లింపులు, జాతీయ న్యాయ డిజిటల్ వ్యవస్థ వంటివి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు.


