గత తీర్పుల్లో వైరుధ్యాలున్నాయి
సోనమ్ రఘువంశీ కేసులో సుప్రీం వ్యాఖ్యలు
స్పష్టత కోసం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే యోచన
అరెస్ట్ పత్రాలు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: నిందితులను అరెస్ట్ చేసే సమయంలో అందుకు గల కారణాలను తప్పనిసరిగా లిఖితపూర్వకంగా ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై స్పష్టతనిచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ విషయంలో గతంలో వెలువడిన తీర్పులు పరస్పరం విరుద్ధంగా ఉండటంతో, చట్టపరమైన స్పష్టత కోసం ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశముందని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. మేఘాలయలో సంచలనం సృష్టించిన ‘హనీమూన్ మర్డర్’కేసులో నిందితురాలికిచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నదంటే..
మేఘాలయలో విహారయాత్రకు వెళ్లి భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి కింది కోర్టులు మంజూరు చేసిన బెయిల్ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ల ధర్మాసనం ఎదుట మేఘాలయ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
ఈ కేసులో నిందితురాలికి అరెస్ట్ కారణాలను ముందుగానే రాతపూర్వకంగా ఇచ్చామని, అయితే అందులో బీఎన్ఎస్ సెక్షన్ 103కి బదులుగా ఉనికిలో లేని సెక్షన్ 403 అని టైపింగ్ పొరపాటు జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ఈ క్లరికల్ తప్పిదాన్ని సాకుగా చూపుతూ కింది కోర్టులు నిందితురాలికి బెయిల్ మంజూరు చేశాయని ఆయన వివరించారు.
ఇది చాలా తీవ్రమైన కేసు
సొలిసిటర్ జనరల్ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. అరెస్ట్కు కారణాలను లిఖితపూర్వకంగా ఇవ్వడంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో వైరుధ్యాలు ఉన్నాయని జస్టిస్ మనోజ్ మిశ్రా గుర్తు చేశారు. పంకజ్ బన్సాల్, డాక్టర్ రాజిందర్ రాజన్ కేసుల్లో అరెస్ట్కు గల కారణాలను రాతపూర్వకంగా ఇవ్వడాన్ని తప్పనిసరి చేశారని న్యాయమూర్తి ప్రస్తావించారు. కానీ, విహాన్ కుమార్ కేసులో మాత్రం అరెస్ట్ కారణాలు తెలియజేస్తే సరిపోతుందని, లిఖితపూర్వకంగా ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చినట్లు ధర్మాసనం పేర్కొంది.
ఈ తీర్పుల మధ్య ఉన్న వైరుధ్యాన్ని పరిష్కరించేందుకు, అవసరమైతే కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తామని స్పష్టం చేసింది. అలాగే, నిందితులను అరెస్ట్ చేసేటప్పుడు కేవలం సెక్షన్లు నమోదు చేయడం మాత్రమే కాకుండా, ఏ నేరం కింద అరెస్ట్ చేస్తున్నారనే పూర్వాపరాలను స్పష్టంగా వెల్లడించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. భర్తను హత్య చేసిన ఈ ఉదంతాన్ని తీవ్రమైన కేసుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ప్రణాళిక ప్రకారం భర్తను మేఘాలయను తీసుకెళ్లి చేసిన హత్య.
భర్తను చంపి, మృతదేహాన్ని లోయలోకి తోసేయడం అత్యంత తీవ్రమైన నేరమని వ్యాఖ్యానించింది. పిటిషన్పై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈలోగా అరెస్ట్ సమయంలో నిందితురాలికి అందించిన అసలైన పత్రాలకు సంబంధించిన స్పష్టమైన కాపీలను దాఖలు చేయాలని మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 3వ తేదీన సోనమ్కు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ శీల్ నాగుల ధర్మాసనం కొట్టివేయడం తెల్సిందే.


