పోక్సో చట్టంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ: లైంగిక దాడికి సంబంధించి మైనర్ బాధితురాలు ఇచ్చే సమాచారం విశ్వసనీయమైందని, దాన్ని అందుకున్న వారు పోక్సో చట్టం కింద పోలీసులతోపాటు సంబంధిత అధికారులకు తప్పక తెలియజేయాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. పోక్సో కింద నేరానికి సంబంధించిన జ్ఞానం ఒక వ్యక్తికి ఉందని ఎప్పుడు చెప్పవచ్చు? అన్న ప్రశ్నపై జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ కె.వి.విశ్వనాథన్లతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్య చేసింది.
‘‘అలాంటి నేరం జరిగిన జ్ఞానం ఉంది’’అని చట్టంలో ఉన్న వాక్యం ప్రత్యక్షంగా చూసిన దానికి మాత్రమే పరిమితం కాదని, మైనర్ బాధితురాలు చెప్పిన సమాచారం కూడా కావచ్చునని తెలిపింది. వివరాలు ఇలా ఉన్నాయి... అరుణాచల్ ప్రదేశ్లో ఎనిమిదేళ్ల బాలిక స్కూల్లో సీనియరైన బాలుడు తనపై దాడి చేశాడని, క్లాస్మేట్స్తోపాటు అక్క, ఉపాధ్యాయులకూ తెలిపింది. అయితే లైంగిక దాడి జరిగిందనేందుకు గమనించదగ్గ గుర్తులేవీ కనిపించకపోవడంతో వారు ఆ బాలిక మాటలు పట్టించుకోలేదు.
అయితే బాధితురాలి తల్లి దాడికి సంబంధించి కేసు నమోదు చేసింది. దీనిపై ట్రయల్కోర్టు విచారణ జరిపి సమాచారం అందుకున్న టీచర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల తప్పిదం ఏమీ లేదని తేల్చింది. గౌహతి హైకోర్టు కూడా దీన్ని నిర్ధారించింది. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు కింది కోర్టుల నిర్ణయాన్ని తప్పుపట్టింది. బాధితురాలు సమాచారమిచ్చిన అందరిని విచారించాల్సిన అవసరం లేదని, సంస్థకు చెందిన ఉపాధ్యాయులు, ఆఫీస్బేరర్లందరినీ పోక్సో చట్టంలోని సెక్షన్ 21 కింద విచారించాలని లేదని తెలిపింది.
అయితే బాధితురాలి నుంచి నేరుగా సమాచారం అందుకున్న వారు దాన్ని అధికారులకు రిపోర్ట్ చేయకపోవడాన్ని తప్పుపట్టాలని స్పష్టం చేసింది. అక్క, క్లాస్మేట్, హెడ్గర్ల్ అందరూ మైనర్లే కాబట్టి వారికి నేరంతో సంబంధం లేదని తెలిపింది. మైనర్ బాధితులు జరిగిన అకృత్యానికి సంబంధించిన సమాచారం సరిగ్గా చెప్పలేకపోవచ్చునని, గాయాల్లాంటివి కనిపించలేదని వారి మాటలను కొట్టివేయరాదని వివరించింది. ఈ కారణంగానే తాము బాధితుల నుంచి లైంగిక దాడికి సంబంధించిన లేదా దాడి జరగవచ్చునన్న సమాచారాన్ని తప్పకుండా సంబంధిత అధికారులు, లేదా పోలీసులకు తెలియజేయాలని స్పష్టం చేస్తున్నట్లు తెలిపింది.


