ప్రదాన నిందితుని ఎన్‌కౌంటర్‌ | Baruipur molestation case killed in police encounter investigation progresses | Sakshi
Sakshi News home page

ప్రదాన నిందితుని ఎన్‌కౌంటర్‌

Jul 9 2026 5:07 AM | Updated on Jul 9 2026 5:07 AM

Baruipur molestation case killed in police encounter investigation progresses

బాలిక హత్యాచారం కేసులో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం 

ఘటనాస్థలికి తీసుకెళ్లిన పోలీసులు 

సర్వీస్‌ తుపాకీ లాక్కుని కాల్పులు జరిపిన నిందితుడు 

పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయపడి చనిపోయిన నిందితుడు 

ఎన్‌కౌంటర్‌ను సమర్థించిన బీజేపీ.. తప్పుబట్టిన టీఎంసీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో నాలుగోతేదీన స్నేహితురాలికి పుట్టినరోజు బహుమతి కొనేందుకు బయటకు వెళ్లి అదృశ్యమై సరస్సులో శవమై తేలిక 11 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్యోదంతంలో బుధవారం ప్రధాన నిందితుడు ప్రభాస్‌ మొండల్‌ను పశ్చిమబెంగాల్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. దీంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఇటీవల ఎన్నికల్లో ఓడించి అధికారంలోకి వచ్చిన సువేంధు అధికారి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇది తొలి పోలీస్‌ చర్యగా నిలిచిపోయింది. 

ఎన్‌కౌంటర్‌ వివరాలను సీనియర్‌ పోలీస్‌ అధికారి మీడియాకు వెల్లడించారు. హత్యాచార ఘటన పూర్వాపరాలను తెల్సుకునేందుకు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం సుర్జాపూర్‌ హాట్‌లోని ఘటనాస్థలికి మంగళవారం అర్ధరాత్రిదాటాక 12.45 నిమిషాలకు నిందితుడిని పోలీసులు తీసుకెళ్లారు. అదే సమయంలో పోలీసుల నుంచి సరీ్వస్‌ తుపాకీని తీసుకుని మొండల్‌ పోలీసులపైకి ఒక రౌండ్‌ కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు వెంటనే ఎదురుకాల్పులు జరిపారు. 

దీంతో బుల్లెట్‌ గాయాలతో రక్తమోడుతున్న నిందితుడిని హుటాహుటిన సమీప బారుయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు ధ్రువీకరించారు. బాలికను చంపేసి గోనెసంచిలో కుక్కి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడే కొలనులో పడేశారన్న వార్త తెలిసి నాలుగురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు, ప్రజాగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌ జరగడం గమనార్హం.

 మేజి్రస్టియల్‌ విచారణ తర్వాత ప్రధాన నిందితుడు మొండల్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించనున్నారు. మరోవైపు ఇదే ఉదంతంలో కబీర్‌ మొల్లా అనే మరో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. ఆనంద్‌ సర్దార్, దివాకర్‌ సర్దార్‌లను గతంలోనే అరెస్ట్‌చేశారు. గతంలోనే ప్రభాస్‌ మొండల్‌నూ అరెస్ట్‌చేయగా ఈ కేసులో మొత్తంగా అరెస్టుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ముగ్గురు నిందితులు ఉన్నారు. హత్యోదంతం వెలుగుచూసిన కొన్ని గంటలకే ఈ ఘటనలో సంబంధం ఉందనే అనుమానంతో ఒకతడిని స్థానికులు కొట్టి చంపిన విషయం తెల్సిందే.  

వాడి శవం నాకు అక్కర్లేదు: తల్లి 
పోలీసు ఎన్‌కౌంటర్‌లో నీ కుమారుడు చనిపోయాడని తల్లి సంధ్యా మొండల్‌కు అధికారులు సమాచారం ఇవ్వగానే ఆమె ఆగ్రహంగా స్పందించారు. ‘‘చెడు అలవాట్లకు బానిసైన వాడు నా కొడుకే కాదు. వాడి మృతదేహాన్ని నేను తీసుకోను. తాగుడు మానేయమని ఎన్నిసార్లు మొత్తుకున్నా వినిపించుకోలేదు. వాడు చనిపోయినా నాకు ఏమాత్రం బాధ లేదు. బాలికను దారుణంగా హింసించినందుకు వాడికి తగిన శాస్తి జరిగింది. మార్చురీలో వాడి ముఖం చూసేందుకు కూడా నేను వెళ్లను. నేనే కాదు మా కుటుంబంలో ఎవరూ వాడి మృతదేహాన్ని తెచ్చుకోము’’అని తల్లి తెగేసి చెప్పారు. 

నేనూ బాధితురాలినే: మొండల్‌ భార్య 
భర్త మృతిచెందాక ప్రధాన నిందితుని భార్య చంపా స్పందించారు. ‘‘నా భర్త అమాయకుడు, ఈ నేరం చేయలేదు అని నేను చెప్పను. తనతో జీవిస్తూ ఎన్నో బాధలు పడ్డా. హత్యోదంతంలో ఇతని పేరు విన్పించగానే ఇలాంటిదేమో చేసే ఉంటాడని ముందుగానే ఊహించా. పెళ్లయిన నాటి నుంచి వేధింపులకు గురిచేశాడు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. ఏ పనీ చేసేవాడు కాదు’’అని ఆమె తెలిపారు. 

ఎన్‌కౌంటర్‌పై భిన్నాభిప్రాయాలు 
ప్రధాన నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతమవడంతో ఈ ఘటనకు సరైన న్యాయం జరిగిందని బీజేపీ వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో 2013లో కామ్‌ధునీలో 20 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసునూ తిరిగితోడి నిందితులకు ‘సరైన’శిక్ష పడేలా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి దేవ్‌జీత్‌ సర్కార్‌ అన్నారు. అయితే ఎన్‌కౌంటర్‌లో నిందితుడిని హతమార్చడాన్ని టీఎంసీ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘సువేందు సర్కార్‌కు రాష్ట్ర పోలీసులపై నియంత్రణ ఉందా? రాష్ట్రంలో బెంగాల్‌–ఉత్తరప్రదేశ్‌ 2.0ను విధానం అమలుచేద్దామని చూస్తున్నారా? బెంగాల్‌లో బీజేపీ పాలన ఉందా? ఎన్‌కౌంటర్‌లో చంపేయడం అంటే ఆటవికంగా పాలించడమే’’అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. 

ర్యాలీలో బాహాబాహీ.. 
బాలిక హత్యోదంతాన్ని నిరసిస్తూ బుధవారం కోల్‌కతాలోని హజ్రా రోడ్‌లో టీఎంసీ నేతలు, కార్యకర్తలు చేపట్టిన నిరసన ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకున్నారు. దొంగలు అని నినదిస్తూ అవాంతరాలు సృష్టించారు. మానవహారంగా నిలబడి ర్యాలీని అడ్డుకోవడంతో ఆగ్రహంతో టీఎంసీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఇదికాస్త తోపులాటగా మారింది. కార్యకర్తలు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు లాఠీచార్జ్‌ చేసి పరిస్థితిని అదుపుతప్పకుండా నిలువరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement