అమర్‌నాథ్‌: మంచు శివలింగం అదృశ్యం! | Amarnath Yatra 2026: Holy Ice Shivling Melts Within 5 Days Due To Climate Change | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్‌: మంచు శివలింగం అదృశ్యం!

Jul 8 2026 10:57 AM | Updated on Jul 8 2026 11:05 AM

Amarnath Yatra 2026: Holy Ice Shivling Melts Within 5 Days Due To Climate Change

శ్రీనగర్: వార్షిక అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి వారంలోనే పవిత్ర గుహలోని సహజసిద్ధ మంచు శివలింగం దాదాపు పూర్తిగా కరిగిపోయింది. మే నెలలో సుమారు ఏడు అడుగుల ఎత్తున ఉన్న ఈ మంచు లింగం, జూలై 7 నాటికి 99 శాతం మేర క్షీణించిందని అధికారులు తెలిపారు. గడిచిన మూడేళ్లుగా ఈ మంచు రూపం వారం రోజులకు మించి నిలవడం లేదు.

ప్రాంతీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉష్ణగాలులు, శీతాకాలంలో తగ్గిన మంచు కురిసే శాతమే ఇందుకు ప్రధాన కారణాలని పర్యావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీ వల్ల గుహలో ఉత్పన్నమవుతున్న మానవ ఉష్ణోగ్రతలు, కాలుష్యం కూడా ఈ ప్రక్రియను వేగవంతం చేశాయి. రోజుకు 13 వేల నుంచి 20 వేల మంది వరకు భక్తులు గుహను సందర్శిస్తుండటంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జూన్ 28న ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్రలో ఇప్పటికే లక్షకు పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. శివలింగం కరిగిపోయినప్పటికీ, ఆ పవిత్ర స్థలానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత కారణంగా భక్తులు  నిరుత్సాహపడకుండా భారీ సంఖ్యలో తరలివస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కల్పించిన కట్టుదిట్టమైన భద్రత, వసతులపై యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాత్రను జూన్ మధ్యలోనే ప్రారంభించి ఉంటే మరింత మందికి మంచు లింగ దర్శన భాగ్యం కలిగేదని కొందరు భక్తులు అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement