కర్ణాటక క్వారీలో ఘోర ప్రమాదం.. స్పందించిన సీఎం డీకే | Quarry Accident At Karnataka Bangalore | Sakshi
Sakshi News home page

కర్ణాటక క్వారీలో ఘోర ప్రమాదం.. స్పందించిన సీఎం డీకే

Jul 2 2026 1:32 PM | Updated on Jul 2 2026 1:37 PM

Quarry Accident At Karnataka Bangalore

బెంగళూరు: బెంగళూరులో ఘోర ప్రమాద ఘటన వెలుగు చూసింది. క్వారీలో బండ రాయి మీద పడి తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డినట్టు సమాచారం. ఈ ఘటనలో మృతులను బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై సీఎం డీకే శివకుమార్‌ సైతం స్పందించి.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

వివరాల మేరకు.. బెంగళూరు దక్షిణ తాలూకాలోని మడపట్టణ (Madapattana) సమీపంలోని ఓ స్టోన్ క్రషర్ క్వారీలో గురువారం ఉదయం 6 గంటల నుంచి 6:30 గంటల మధ్య ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీలో కార్మికులు పనులు చేస్తున్న సమయంలో భారీ గ్రానైట్ బండరాయి ఒక్కసారిగా విరిగి కింద పడింది. కొండపై భాగంలో ట్రాక్టర్ సాయంతో బండరాయిని తరలిస్తున్న సమయంలో అది అదుపుతప్పి కింద పనిచేస్తున్న కార్మికులపై పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు.

వలస కార్మికులే బాధితులు
మృతులంతా రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న వలస కార్మికులేనని పోలీసులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది బీహార్‌కు చెందినవారు కాగా, కొందరు ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు స్పందన బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉండటంతో భారీ యంత్రాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్వారీ పరిసరాలను పూర్తిగా మూసివేసి, ఎవ్వరినీ లోపలికి అనుమతించడం లేదు.

ప్రమాదానికి కారణమేంటి?
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే బ్లాస్టింగ్ కారణంగా ఏర్పడిన కంపనాలు లేదా భారీ బండరాయిని తరలించే సమయంలో జరిగిన లోపం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. క్వారీలో భద్రతా నిబంధనలు పాటించారా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

ముఖ్యమంత్రి ఆవేదన
ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్వారీల్లో భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల అమలు, అనుమతులు, బ్లాస్టింగ్ విధానాలు తదితర అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement