న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో త్వరలో జరగబోయే విస్తరణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్ర మరింత కీలకం కానున్నదనే చర్చ జోరందుకుంది. 2019 మే 30న తొలిసారి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, 2025 ఆగస్టులో లాల్ కృష్ణ అద్వానీ పేరిట ఉన్న 2,256 రోజుల రికార్డును అధిగమించి, భారత చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన హోంమంత్రిగా రికార్డు సృష్టించారు.
2029 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా చేపడుతున్న ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కొత్త తరాన్ని ప్రోత్సహించే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉండగా.. అమిత్ షా సాధించిన పరిపాలనా విజయాల కారణంగా ఆయన రాజకీయ ప్రాధాన్యత మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. అమిత్ షా తన ఏడేళ్ల హోంమంత్రిత్వ కాలంలో దేశ భద్రత, రాజకీయ వ్యూహాల్లో ఎన్నో కీలక మైలురాళ్లను అధిగమించారు. 2019లో జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370, 35A రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆమోదం, 2023లో కొత్త నేర చట్టాలను తీసుకురావడం వంటివి ఆయన కెరీర్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈశాన్య రాష్ట్రాలలో శాంతి స్థాపన కోసం 12కు పైగా చారిత్రాత్మక ఒప్పందాల ద్వారా దాదాపు 11,000 మంది తీవ్రవాదులను ప్రధాన స్రవంతిలోకి అమిత్ షా తీసుకువచ్చారు. అలాగే, 2026 మార్చి నాటికి దేశాన్ని నక్సలిజం నుండి విముక్తి చేశారు. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన అమిత్ షా, ఎంపీగా తన సొంత నియోజకవర్గమైన గాంధీనగర్లో నిరంతరం పర్యటిస్తూనే, పార్టీ మేనేజ్మెంట్లో సునీల్ బన్సల్, వినోద్ తావ్డే వంటి నేతలను తీర్చిదిద్దారు. 2026 మే నెలలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత, బంగ్లాదేశ్ నుండి వచ్చే చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దులో ఫెన్సింగ్ పనులను వేగవంతం చేశారు. అలాగే, 2026 జూన్లో హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య చారిత్రాత్మక ‘యమునా జలాల ఒప్పందం కుదర్చడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ బయోడేటా ఆధారంగానే మోదీ క్యాబినెట్లో ఆయనకు మరింత పెద్ద పీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.


