అమిత్‌ షా ‘లెక్చర్‌’ మాకొద్దేవద్దు | Not interested in Amit Shah giving us a lecture says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా ‘లెక్చర్‌’ మాకొద్దేవద్దు

Aug 13 2026 5:06 AM | Updated on Aug 13 2026 5:06 AM

Not interested in Amit Shah giving us a lecture says Rahul Gandhi

ఊకదంపుడు ఉపన్యాసాలు అక్కర్లేదు   

అమిత్‌ షా రాజీనామా చేయాల్సిందే  

రాహుల్‌ డిమాండ్‌  

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇచ్చే ‘లెక్చర్‌’వినాలన్న ఆసక్తి ప్రతిపక్షానికి లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తేల్చిచెప్పారు. అభూత కల్పనలు, ఊకదంపుడు ఉపన్యాసాలు తమకు అక్కర్లేదని పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు అమిత్‌ షా చేసిన ప్రకటనపై రాహుల్‌ బుధవారం స్పందించారు. అమిత్‌ షా ఇమేజ్‌ బెలూన్‌ ఇప్పటికే పగిలిపోయిందని అన్నారు. 

అందులో గ్యాస్‌ నింపడానికి ఆయన చివరి నిమిషంలో ప్రయతి్నస్తున్నారని ఎద్దేవా చేశారు. నీట్‌ పేపర్‌ లీక్‌పై నిరసనకు దిగిన విద్యార్థులపై పెల్లెట్‌ గన్‌లతో కాల్పులు జరపాలని ఎవరు ఆదేశించారో తెలుసుకోవాలని యువత కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులపై కాల్పులు జరపాలని అమిత్‌ షా ఆదేశించి ఉంటే ఆయన బాధ్యుడవుతాడని, ఒకవేళ ఆదేశించకపోతే ఆయన అసమర్థుడని తేల్చిచెప్పారు. ఏది ఏమైనా అమిత్‌ షా రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. 

రాహుల్‌ గాంధీ బుధవారం మీడియాతో మాట్లాడారు. అమిత్‌ షాతో చర్చ జరపడానికి తమకు ఏమాత్రం ఆసక్తి లేదన్నారు. ‘‘విద్యార్థులపై ఎవరు కాల్పులు జరిపారు? కాల్పులు జరపాలని ఎవరు ఆదేశించారు? విద్యార్థుల్లో ఒకరిని అంధుడిని చేసింది ఎవరు? ఒక విద్యార్థి చెవిలో ఎవరు కాల్చారు? లాఠీలు, మేకులతో కూడిన కర్రలతో విద్యార్థులను కొట్టాలని ఎవరు ఆదేశించారు? అనేది తెలుసుకోవాలని కోరుతున్నాం. అందులో మాత్రమే మాకు ఆసక్తి ఉంది. 

పిల్లలపై కాల్పులు జరపాలని అమిత్‌ షా ఆదేశాలు ఇచ్చారా లేదా? ఒకవేళ ఇచ్చి ఉంటే ఆయన బాధ్యుడు కాబట్టి రాజీనామా చేయాలి. ఒకవేళ ఇవ్వకపోతే అసమర్థుడు కాబట్టి రాజీనామా చేయాలి’’అని పేర్కొన్నారు. తాను మాట్లాడుతుండగా అంతరాయం కలిగించినందుకు విలేకరులపై రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌ షా మాట్లాడేటప్పుడు కూడా ఇలాగే చేస్తారా? అని ప్రశ్నించారు. అమిత్‌ షాలో అంత ప్రత్యేకత ఏముంది? ఆయన ముందు ఒక ఎలుకలాగా ఎందుకు నిల్చుంటారు? అని విలేకరులను నిలదీశారు.

మౌనమే ఆయన అంగీకారం  
జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసన విషయంలో తాను మౌనంగా ఉండడం లేదని రాహుల్‌ గాంధీ అన్నారు. ‘‘విద్యార్థులపై జరిగే ఏ విధమైన హింసనైనా సమరి్థంచబోమని విలేకరుల సమావేశంలో స్పష్టంగా చెప్పాను. నేను మౌనంగా లేను, బహిరంగంగానే ఈ విషయాన్ని చెబుతున్నాను’’అని వివరించారు. అనంతరం తన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ‘ఎక్స్‌’లో రాహుల్‌ షేర్‌ చేశారు. ‘‘ఒక వ్యక్తికి నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు, అతని మౌనమే అతనికి బదులుగా మాట్లాడుతుంది. అమిత్‌ షా మౌనమే ఆయన వ్యక్తంచేస్తున్న అంగీకారం’’అని ఉద్ఘాటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement