పట్నా: ‘రక్షాబంధన్’ను పురస్కరించుకుని ఇండియా పోస్ట్ (భారత తపాలా శాఖ) అక్కాచెల్లెళ్లకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలలో నివసిస్తున్న సోదరులకు కూడా రాఖీలు సురక్షితంగా, సమయానికి పంపించే సదుపాయం కల్పించింది. ఈ ప్రత్యేక సర్వీస్లో రాఖీ బుకింగ్లపై తపాలా ఛార్జీలలో 10 శాతం ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నారు. అంతేకాకుండా, అతి తక్కువ ధరలకే ఆకర్షణీయమైన రాఖీ కవర్లు పోస్టాఫీసులలో అందుబాటులో ఉంచారు.
బీహార్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ శశి శాలిని కుంజర్ మాట్లాడుతూ రక్షాబంధన్ కేవలం రాఖీ కట్టుకునే వేడుక మాత్రమే కాదని, తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమ, నమ్మకం, బాల్యపు జ్ఞాపకాలను పదిలపరుచుకునే సందర్భమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఈ తపాలా నెట్వర్క్ ద్వారా రాఖీలను చేరవేసి, దూరంగా ఉన్నప్పటికీ అనుబంధాల మాధుర్యాన్ని చెక్కుచెదరకుండా ఉంచడమే ఈ సర్వీస్ ప్రధాన ఉద్దేశమని ఆమె తెలిపారు.
తపాలా కార్యాలయాల్లో రాఖీ బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాఖీలను ఎలాంటి అంతరాయం లేకుండా సకాలంలో గమ్యస్థానానికి చేరవేయాలని పోస్టల్శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఉత్తరాలను చేరవేయడమే కాకుండా, ప్రజల అనుబంధాలను అనుసంధానించడమే తమ అసలైన ధ్యేయమని తపాలా శాఖ స్పష్టం చేసింది. విదేశాల్లోని తోబుట్టువులకు ఈ ప్రత్యేక సేవ ద్వారా రాఖీలు పంపి ఈ పండుగ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలని సోదరీమణులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 28న దేశవ్యాప్తంగా రాఖీ పండుగను నిర్వహించుకోనున్నారు.
ఇది కూడా చదవండి: నీట్ యూజీతో ఆగలేదు.. నీట్ పీజీలోనూ అవే తలనొప్పులు!


