న్యూఢిల్లీ: ఆన్లైన్ లేదా కౌంటర్ ద్వారా చేసిన బుకింగ్స్ రద్దయితే పోస్టేజీ ఫీజును రిఫండ్ చేయనున్నట్లు ఇండియా పోస్ట్ వెల్లడించింది. వెబ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా సెల్ఫ్ బుక్ చేసుకున్న వారు సదరు ఆర్టికల్ను పోస్టాఫీసు స్వీకరించడానికి ముందు రద్దు చేసుకోవచ్చని, పోస్టేజీ ఫీజు రిఫండ్ను కోరవచ్చని పేర్కొంది. కౌంటర్లో బుక్ చేసుకుంటే పోస్టాఫీసుకు క్యాన్సిల్ అభ్యర్థనను పంపించవచ్చని, అలాగే వివరాలు సరిగ్గా లేకపోయిన పక్షంలో పోస్టాఫీసే.. బుక్ చేసిన రోజునే బుకింగ్ను రద్దు చేయొచ్చని ఇండియా పోస్ట్ తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం సర్వీసు రద్దు అయిన పక్షంలో పోస్టేజీ, స్పెషల్ ఫీజు, ఎయిర్ సర్చార్జీలను రిఫండ్ చేయొచ్చు.


