రూ.10 వేల కోట్ల కంపెనీకి బాస్.. హోమ్ లోన్ ఇవ్వని బ్యాంక్! | Rs 10000 Crore Company Founder Rejected for a Home Loan Here is Why | Sakshi
Sakshi News home page

రూ.10 వేల కోట్ల కంపెనీకి బాస్.. హోమ్ లోన్ ఇవ్వని బ్యాంక్!

Jul 16 2026 8:03 PM | Updated on Jul 16 2026 8:19 PM

Rs 10000 Crore Company Founder Rejected for a Home Loan Here is Why

సొంతంగా ఒక కంపెనీని నిర్మించడం అనేది చాలా సాహసంతో కూడుకున్న పని, అది పెద్ద విజయం కూడా. అలాంటి వ్యక్తికి బ్యాంకు హోమ్ లోన్ ఇవ్వడం పెద్ద విషయం కాదని చాలామంది అనుకుంటారు. కానీ.. ఇక్కడ ఒక వ్యాపారవేత్తకు ఎదురైన సంఘటన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

ఫిన్‌టెక్ సంస్థ రైజ్ (ధన్ పేరెంట్ కంపెనీ) వ్యవస్థాపకుడు ప్రవీణ్ జాధవ్ ఇటీవల హోమ్ లోన్ కోసం ఓ బ్యాంకును ఆశ్రయించారు. అయితే ఆయన దరఖాస్తును బ్యాంకు తిరస్కరించింది. కారణం ఏమిటంటే.. ఆయనను 'హై రిస్క్ బారోవర్'గా పరిగణించడం. దాదాపు 1.2 బిలియన్ డాలర్ల (రూ.10 వేల కోట్ల కంటే ఎక్కువ) విలువైన కంపెనీని నడుపుతున్న వ్యక్తికి కూడా ఈ పరిస్థితి రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.

తనకు ఎదురైనా అనుభవాన్ని ప్రవీణ్ జాధవ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయింది. దీంతో పలువురు స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు కూడా తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను గురించి వెల్లడించారు.

నిజానికి బ్యాంకులు ఎవరి కంపెనీ విలువ ఎంత ఉందో అనే విషయాలను పరిగణలోకి తీసుకుని లోన్స్ అందించవు. లోన్ తీసుకున్న వ్యక్తి దాన్ని క్రమం తప్పకుండా తిరిగి చెల్లించగలడా.. లేదా?, అనే అంశాన్నే ప్రధానంగా పరిశీలిస్తాయి. అందుకే గతంలో తీసుకున్న లోన్స్ హిస్టరీ, ఆదాయపు పన్ను రిటర్నులు, స్థిరమైన ఆదాయం వంటి వివరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి.

ఉద్యోగుల విషయంలో ఇది చాలా సులభం. ఎందుకంటే ప్రతి నెలా ఒకే తేదీకి జీతం వస్తుంది. శాలరీ స్లిప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు చూసి వారి ఆదాయాన్ని సులభంగా అంచనా వేయవచ్చు. అందుకే వారికి హోమ్ లోన్ ప్రక్రియ కూడా చాలా వేగంగా లభిస్తుంది. కానీ వ్యాపారవేత్తల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వారి ఆదాయం ప్రతి నెల ఒకేలా ఉండదు. కంపెనీ లాభాలు, డివిడెండ్లు, షేర్ల విలువ ఆధారంగా ఆదాయం మారుతూ ఉంటుంది. చాలామంది స్టార్టప్ వ్యవస్థాపకులు కంపెనీ విలువ వేల కోట్ల రూపాయలు ఉన్నా, వ్యక్తిగతంగా తక్కువ జీతమే తీసుకుంటుంటారు. ఈ కారణంగా వారి ఆదాయాన్ని బ్యాంకులు స్థిరమైనదిగా పరిగణించకపోవచ్చు.

ఈ ఘటనపై స్పందించిన బ్యాంక్‌బజార్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రతి శెట్టి కూడా ఇదే విషయాన్ని వివరించారు. బ్యాంకులు ఆదాయం ఎంత స్థిరంగా ఉందో, తిరిగి చెల్లించే సామర్థ్యం ఎంత ఉందో మాత్రమే పరిశీలిస్తాయని చెప్పారు. అయితే సరైన ఆర్థిక పత్రాలు, పన్ను వివరాలు, ఆదాయ రికార్డులు సమర్పిస్తే.. వ్యాపారవేత్తలు కూడా రుణాలు పొందే అవకాశాలు మెరుగుపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement