భార్యకు శాడిస్టు భర్త వేధింపులు
అనారోగ్యంతో నిరాకరించిన భార్య
మాట వినలేదని బంధువులతో కలిసి దాడి
ప్రాణభయం ఉందంటూ 112కు కాల్చేసిన బాధితురాలు
తిరుపతి క్రైం: కట్టుకున్న భర్తే బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపి సంవత్సరాలుగా పడుపువృత్తి చేయించాడని, ఇప్పుడు ఆ పనికి నిరాకరించడంతో విచక్షణారహితంగా దాడి చేశాడంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి రుణం తీరేవరకు వ్యభిచారం చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాడని కన్నీరుమున్నీరైంది. తనకు ప్రాణహాని ఉందని 112కు ఫోన్ చేసి పోలీసుల రక్షణ కోరింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలచేనులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బాధితురాలి కథనం ప్రకారం.. చింతలచేనుకు చెందిన దంపతులకు 14 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వివాహమైన తొలి రెండేళ్లు అత్తమామ సంపాదనతో కుటుంబ జీవితం సజావుగా సాగింది. అనంతరం భర్త బాధితురాలిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడు. పదేళ్లుగా పడుపువృత్తి చేయిస్తున్నాడు. కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురికావడంతో ఇకపై ఆ పని చేయలేనని బాధితురాలు స్పష్టం చేయడంతోపాటు పుట్టింటికి వెళ్లిపోయింది.
దీంతో ఆగ్రహించిన భర్త, అతని బంధువులు బాధితురాలి కుటుంబంపై తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టడంతోపాటు దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు 112కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఇంటి నిర్మాణానికి తీసుకున్న రూ.50 లక్షల రుణం తీరే వరకు తిరిగి వచ్చి వ్యభిచారం కొనసాగించాలని భర్త ఒత్తిడి తెస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.


