పంజాబ్లోని ఫిరోజ్పూర్లో జరిగిన ఒక వివాహంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మరికొద్ది క్షణాల్లో పెళ్లి అనగా వరుడిని చూసిన వధువు హతాశురాలైంది. తనకు కాబోయే భర్త ఇతను కాదు అంటూ పెళ్లికి నిరాకరించడంతో వివాదం మొదలైంది.రాజస్థాన్లోని ఛత్తర్గఢ్ నుండి వచ్చిన పెళ్లి ఊరేగింపు, చివరకు వధువు లేకుండానే తిరిగి వెళ్ళిపోయిన ఘటన వైరల్గా మారింది.
పోలీసుల సమాచారం ప్రకారం, బంధుమిత్రుల సందడి మధ్య వివాహ తంతు కొనసాగుతోంది. అగ్ని గుండం చుట్టూ ప్రదక్షిణలు చేసే వేడుక ప్రారంభానికి ముందు వరుడిని చూసిన వధువు షాకైంది. ఈ పెళ్లి నాకొద్దు అంటూ తెగేసి చెప్పేసింది. దీంతో అర్థాంతరంగా పెళ్లి ఆగిపోయింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఈ వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది.
పెళ్లికి ముందు తనకు వేరొక యువకుడి ఫోటో చూపించి, వివాహ వేదిక వద్ద వరుడిగా వేరే వ్యక్తిని తీసుకొచ్చారని వధువు ఆరోపించింది. అయితే, వరుడి కుటుంబం దీనికి భిన్నమైన వాదనను వినిపించింది. ఒక మ్యారేజ్ బ్రోకర్ ద్వారా ఈ పెళ్లి కుదిరిందని వరుడి కుటుంబం వాదించింది. రెండు కుటుంబాల అంగీకారంతోనే ఈ వివాహం నిశ్చయమైందని, పెళ్లికి ముందు ఇరు పక్షాలు ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయని వారు చెప్పారు. వరుడి ఫోటోలను ముందుగానే చూపించామని, మధ్యవర్తులు , వధువు తల్లి వరుడి తాత (తల్లి వైపు) మహేంద్ర సింగ్ తెలిపారు. అయినా సరే ససేమిరా అన్న వధువు మాత్రం పెళ్లికి గట్టిగా నిరాకరించింది.
ఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది?
మరోవైపు రెండు రోజుల క్రితమే వరుడి కుటుంబం నుండి ఫిర్యాదు అందిందని, దానిపై దర్యాప్తు ప్రారంభించా మని గురు హర్ సహాయ్ డీఎస్పీ తేజిందర్పాల్ సింగ్ తెలిపారు. విచారణ సమయంలో ఇరు పక్షాలు తమ వాదనలను వినిపించాయనీ, ఈ సమస్యను పరిష్కరించుకున్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. అయితే ఈ వివాదం ఎలా ముగింసిందనే దానిపై స్పష్టత లేదు.
ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!


