పశ్చిమ చంపారన్: బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో కట్నంగా గేదె, ద్విచక్ర వాహనం ఇవ్వలేదన్న కోపంతో భార్యను హత్య చేసిన కేసులో నిందితుడైన భర్త సుభాష్ యాదవ్కు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. 2020లో జరిగిన ఈ దారుణ ఘటనపై ఆరేళ్ల విచారణ అనంతరం కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో మృతిచెందిన మహిళను రీనా దేవిగా గుర్తించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పెళ్లి సమయంలో అదనపు కట్నంగా గేదె, బైక్ ఇవ్వలేదన్న కారణంతోనే సుభాష్ తన కుమార్తెను హతమార్చాడని ఆమె ఆరోపించారు. 2020లో నిందితుడు భార్యను హత్య చేసిన అనంతరం, ఆధారాలు దొరక్కుండా చేసేందుకు మృతదేహాన్ని తగులబెట్టి, ఆపై అవశేషాలను ముక్కలుగా నరికి మాయం చేశాడని దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. బగహా నగరంలోని అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి మానవేంద్ర మిశ్రా ధర్మాసనం ఈ కేసును విచారించి, సుభాష్ యాదవ్ను దోషిగా నిర్ధారించింది.
హత్య నేరానికి గాను జీవితఖైదుతో పాటు రూ.ఒక లక్ష జరిమానా, ఆధారాలను నాశనం చేసినందుకు మరో 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించింది. అలాగే మృతురాలి మైనర్ పిల్లల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, వారి పోషణ కోసం నెలకు రూ.4,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారికి డీఎల్సీ పునరావాస పథకం కింద ప్రయోజనాలు కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: ఇదేందిరా సామీ.. కుర్చీ కోసం రైలు ఆపిన గార్డు!


