సాక్షి, తాడేపల్లి: రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో ఇవాళ(బుధవారం) వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. నియోజకవర్గ ఇంఛార్జి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘మరో ఏడాదిలో నా పాదయాత్ర మొదలవుతుంది. ఆ తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయండి’’ అంటూ వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారని ఆయన దుయ్యబట్టారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. విద్యార్థులు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అందుకే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మీద రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అదే సమయంలో మన వైయస్సార్సీపీపై రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. అందుకే నాటి గత మన ఐదేళ్ల పరిపాలనను, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ వివరించారు.


