రోమ్: ఇటలీ సుప్రీంకోర్టు ఒక పరువు హత్య కేసులో సంచలన తీర్పును వెలువరించింది. పాకిస్తాన్ సంతతికి చెందిన 18 ఏళ్ల సమన్ అబ్బాస్ హత్యోదంతంలో దోషులుగా తేలిన ఆమె తల్లిదండ్రులు, మరో ఇద్దరు బంధువులకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు సమర్థించింది. మరో నిందితుడైన ఆమె బాబాయికి విధించిన 22 ఏళ్ల జైలు శిక్షను కూడా ఖరారు చేసింది. ఇటలీని కుదిపేసిన ఈ పరువు హత్య కేసులో అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పుతో విచారణ ప్రక్రియ ముగిసింది.
2021 ఏప్రిల్లో ఉత్తర ఇటలీలోని నోవెల్లారా నగరంలో సమన్ అబ్బాస్ దారుణ హత్యకు గురయ్యింది. పాకిస్తాన్లో తన బంధువుతో బలవంతంగా జరిపించాలనుకున్న వివాహాన్ని ఆమె వ్యతిరేకించడమే ఈ దారుణానికి కారణమైంది. కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన సమన్, గతంలో అధికారుల సహాయంతో షెల్టర్ హోమ్లో తలదాచుకుంది.
అయితే ఏప్రిల్ 2021లో తిరిగి కుటుంబంతో కలిసి వెళ్లిన ఆమె అదృశ్యమయ్యింది. ఆ తర్వాత నిందితులు తమ చేతిలో పనిముట్లతో వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ కీలక ఆధారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, పాకిస్తాన్ నుంచి నిందితులను ఇటలీకి రప్పించారు. ఈ తీర్పుపై స్పందించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ.. ఒక మహిళ స్వేచ్ఛా జీవితాన్ని హరించే సంస్కృతి, సంప్రదాయాలకు ఇటలీలో తావులేదని అన్నారు. బాధ్యులకు సరైన శిక్ష పడటం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: విదేశీ యువతికి చీర సింగారించిన కానిస్టేబుల్


