ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో గల తాజ్ మహల్ వద్ద ఒక మహిళా కానిస్టేబుల్ చూపిన మానవత్వం నెట్టింట వైరల్గా మారింది. అర్జెంటీనాకు చెందిన పర్యాటక బృందం మంగళవారం తాజ్ మహల్ను సందర్శించడానికి వచ్చింది. అందులోని ఒక పర్యాటకురాలు సాంప్రదాయ చీరకట్టుపై ఆసక్తితో నీలం రంగు చీరను ధరించారు. అయితే, చీరకట్టు సరిగ్గా రాకపోవడంతో ఆమె నడవడానికి ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన క్విక్ రెస్పాన్స్ టీమ్కు చెందిన కానిస్టేబుల్ గుడ్డి దేవి వెంటనే స్పందించారు.
ఆమె ఆ విదేశీ యువతి వద్దకు వెళ్లి, ఆ చీరను చక్కగా సరిదిద్ది, కుచ్చెళ్లు ఎలా పెట్టుకోవాలో, పల్లును ఎలా సర్దుకోవాలో ఓపిగ్గా నేర్పించారు. దీనికి సదరు పర్యాటకురాలు సంతోషం వ్యక్తం చేస్తూ, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చీరకట్టు భారతీయ సంస్కృతిలో ఒక అద్భుతమైన వస్త్రధారణ అని ఆమె కొనియాడారు. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు, ఇది ‘అతిథి దేవో భవ’ అనే భారతీయ సంస్కృతికి నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. పర్యాటకులకు సాయం చేసిన కానిస్టేబుల్ గుడ్డి దేవి, ఇతర సిబ్బందితో పర్యాటకులు ఫొటోలు దిగి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: ఒకేసారి 9 విమానాలకు అత్యవసర సంకేతాలు!


