సీఐ వేధింపులతోనే చచ్చిపోతున్నా.. | Suicide note of a minority employee | Sakshi
Sakshi News home page

సీఐ వేధింపులతోనే చచ్చిపోతున్నా..

Jul 16 2026 5:55 AM | Updated on Jul 16 2026 5:55 AM

Suicide note of a minority employee

మృతుడు షేక్‌ దరియా హుస్సేన్‌ (ఫైల్‌) , మాట్లాడుతున్న భార్య షేక్‌ అమిరున్‌

మైనార్టీ ఉద్యోగి సూసైడ్‌ నోట్‌  

పుట్టిన రోజే ఉరి వేసుకుని షేక్‌ దరియా హుస్సేన్‌ మృతి 

గంజాయి కేసు పెడతానని పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు బెదిరించడంతో మనస్తాపం 

రాజీ కుదిర్చేందుకు రంగంలోకి దిగిన టీడీపీ నేతలు 

సాక్షి, నరసరావుపేట, పిడుగురాళ్ల: పోలీసుల వేధింపులు తాళలేక మైనార్టీ వర్గానికి చెందిన ఓ ఉద్యోగి పుట్టినరోజు నాడే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం ఉదయం పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. సివిల్‌ పంచాయితీలో తలదూర్చడమే కాకుండా తాను చెప్పినట్లు వినకుంటే గంజాయి కేసు నమోదు చేస్తానని పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు బెదిరించడంతో చనిపోతున్నానని, తన చావుకి పోలీసులే కారణమని సూసైడ్‌ లెటర్‌లో షేక్‌ దరియా హుస్సేన్‌ (49) పేర్కొన్నాడు. పట్టణంలోని బిలాల్‌ మసీద్‌ సమీపంలో  దరియాహుస్సేన్‌ తన ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుడి భార్య షేక్‌ అమిరున్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... 

»  సత్తెనపల్లిలోని ఉర్దూ అకాడమీలో లైబ్రేరియన్‌గా ఉద్యోగం చేస్తున్న దరియా హుస్సేన్‌  2016లో తన భార్య షేక్‌ అమీరున్‌ పేరిట రెండు రేకుల ఇళ్లను కొనుగోలు చేశాడు. పులికూరి ప్రశాంత్‌ పేరిట ఉన్న ఆ ఇళ్లను అతడి తల్లి లక్ష్మి విక్రయించారు. అయితే ఆ ఇళ్లు 22 ఏ జాబితాలో ఉన్నందున రిజి్రస్టేషన్‌ కాలేదు. దీంతో స్వా«దీన అగ్రిమెంట్‌ రాయించుకున్నారు. ఏడాది తర్వాత మరికొంత నగదు చెల్లించాలంటూ లక్ష్మి ఒత్తిడి చేసింది. దీంతో దరియా హుస్సేన్‌ 2019లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో ప్రస్తుతం తుది తీర్పు దశలో ఉంది. 

ఈ క్రమంలో పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు ఈ నెల 14వ తేదీన ఇళ్లు ఖాళీ చేయాలంటూ దరియా హుస్సేన్‌ను తీవ్ర స్థాయిలో బెదిరించారు. లేదంటే గంజాయి కేసు నమోదు చేసి కుటుంబం మొత్తాన్ని ఇబ్బందులకు గురి చేస్తామని హెచ్చరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దరియా హుస్సేన్‌ సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని మృతి చెందాడు. 

ఎస్పీకి పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు పెట్టుకున్నా సీఐ వేధింపులు ఆగలేదని మృతుడి కుటుంబీకులు వాపోయారు. మైనార్టీ ఉద్యోగి మరణానికి కారణమైన సీఐ వెంకట్రావుపై కేసు నమోదు చేయాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్‌ చేశారు. రానున్న జగనన్న ప్రభుత్వంలో సీఐ వెంకట్రావు తప్పులన్నింటికి చట్ట ప్రకారం శిక్షలు పడతాయని హెచ్చరించారు. బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.  

» మృతుడు తన సూసైడ్‌ నోట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూ­టీ సీఎం పవన్‌ కళ్యాణ్, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్లను ప్రస్తావించాడు. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు, పోలీసు సిబ్బంది తనను ఇబ్బంది పెట్టారని వెల్లడించాడు. సీఐ ఎస్‌.వెంకట్రావు తమ ఇంటికి తాళాలు వేయించినట్లు తెలిపాడు.   

రాజీకి టీడీపీ నేతల యత్నం.. 
తన మరణానికి పోలీసులే కారణమని మృతుడు దరియా హుస్సేన్‌ సూసైడ్‌ లేఖలో పేర్కొనడంతో  రంగంలోకి దిగిన టీడీపీ నేతలు రాజీ యత్నాలు ప్రారంభించారు. సామాన్యులు  కావటంతో సామదాన భేదదండోపాయాలను ప్రయోగించి కేసును పక్కతోవ పట్టించే  కుట్రలకు తెర తీశారు. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు సివిల్‌ పంచాయితీలలో తలదూర్చడంతో ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్యా యత్నాలకు ఒడిగట్టడం గమనార్హం.

ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళతోపాటు ఓ దళిత యువకుడు వీరిలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు ఉన్నతాధికారులు సీఐ వెంకట్రావును వెనుకేసుకొస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. పోలీసుల వేధింపులతో మరణించిన షేర్‌ దరియా హుస్సేన్‌ కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేయాలని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ నాగుల్‌ మీరా డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement