సాక్షి, కాకినాడ: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్.. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ముద్రగడ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్ జగన్.. ఆయన పాడె మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వైఎస్ జగన్ కిర్లంపూడిలోనే ఉన్నారు. ముద్రగడ ఇంటి ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించారు.
అంతకుముందు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన వైఎస్ జగన్.. ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి హెలికాఫ్టర్లో జగ్గంపేటకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడి ముద్రగడ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.

కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు నివాళులు అర్పించారు. అభిమానులు కిర్లంపూడికి పోటెత్తారు. కడసారి ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, అభిమానులు.. అంత్యక్రియల్లో పాల్గొన్నారు.


