న్యూఢిల్లీ: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు తుది నివేదికను సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతమైంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియా సంస్థ, ఏవియేషన్ నిబంధనల ప్రకారం దర్యాప్తును ఆరు వారాల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది.
ఈ దర్యాప్తు ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 2026 నాటికి తుది నివేదిక ముసాయిదాను సిద్ధం చేస్తామని తెలిపింది. ప్రమాదం తీవ్రత, సాంకేతిక సంక్లిష్టతను పరిగణనలోకి తీసుకుని ఈ దర్యాప్తును శాస్త్రీయంగా నిర్వహిస్తున్నామని ఏఏఐబీ తెలిపింది. భారత చట్టాల ప్రకారం విమాన ప్రమాద దర్యాప్తుకు నిర్దేశించిన పది దశలను పూర్తి స్థాయిలో పాటిస్తున్నామని పేర్కొంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) రికార్డింగ్లు, విమానంలోని ఇతర చిత్రాలు లేదా ఆడియోలను బహిర్గతం చేయడం చట్టరీత్యా నిషేధమని కోర్టుకు విన్నవించింది.
సాక్షులు ఎటువంటి ఒత్తిడి లేకుండా నిజం చెప్పేలా చూడటం, దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చేయడం, అంతర్జాతీయ విమానయాన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం కోసమే ఈ నిబంధనలు రూపొందించామని స్పష్టం చేసింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) నిబంధనల ప్రకారం, ఈ విమాన ప్రమాద దర్యాప్తు అనేది కేవలం దేశీయ పరిధిలోనిది మాత్రమే కాదని, అంతర్జాతీయ ఒప్పందాల మేరకు నిర్వహించే ప్రక్రియ అని ‘ఏఏఐబీ’ తన అఫిడవిట్లో వివరించింది.
ఇది కూడా చదవండి: బెంగళూరు తొక్కిసలాట కేసు: ఐపీఎస్ అధికారులకు క్లీన్ చిట్


