రైళ్లలో దుప్పట్లు మాయం.. రైల్వే యాక్షన్ ప్లాన్ ఇదే! | Railway Blankets Vanish Rs 104 Crore Loss Action Plan Unveiled | Sakshi
Sakshi News home page

రైళ్లలో దుప్పట్లు మాయం.. రైల్వే యాక్షన్ ప్లాన్ ఇదే!

Jul 15 2026 1:02 PM | Updated on Jul 15 2026 1:12 PM

Railway Blankets Vanish Rs 104 Crore Loss Action Plan Unveiled

భారతీయ రైల్వేలో ప్రయాణికులకు అందించే సౌకర్యాలు ఎంత విలాసవంతంగా మారుతున్నాయో, అంతే స్థాయిలో కొందరు ప్రయాణికుల బాధ్యత లోపిస్తోందనడానికి తాజా సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) నివేదిక ఒక నిదర్శనం. ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారు బెడ్‌షీట్లు, దుప్పట్లు, తువ్వాళ్లను దొంగిలిస్తుండటంతో గడిచిన నాలుగేళ్లలో (జనవరి 2022 నుంచి మే 2026 వరకు) రైల్వే శాఖకు ఏకంగా రూ.104.51 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. గణాంకాల ప్రకారం, ప్రతి వెయ్యి మంది ఏసీ ప్రయాణికుల్లో ఒకరు రైల్వే వస్తువులను తమతో పాటు పట్టుకెళ్తున్నారు.

మాయమైన వస్తువుల వివరాలు

రైల్వే పరిధిలోని 54 డివిజన్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. అత్యధికంగా ఫేస్ టవల్స్ (ముఖం తుడుచుకునే తువ్వాళ్లు) దొంగలిస్తున్నారు.

  • ఫేస్ టవల్స్: 46.54 లక్షలు

  • బెడ్‌షీట్లు (దుప్పట్లు): 41.13 లక్షలు

  • పిల్లో కవర్లు: 23.59 లక్షలు

  • బ్లాంకెట్లు: 12.95 లక్షలు

  • దిండ్లు: 2.76 లక్షలు

2022 నుంచి 2025 మధ్య కాలంలో ఈ తరహా చోరీలు ఏకంగా 56 శాతం పెరగడం గమనార్హం. డివిజన్ల వారీగా చూస్తే రాజస్థాన్‌లోని బికనీర్ డివిజన్ 25.76 లక్షల వస్తువుల నష్టంతో అగ్రస్థానంలో ఉండగా రాంచీ, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, కొన్ని డివిజన్లు అద్భుతమైన నియంత్రణను ప్రదర్శించాయి. తిరుచిరాపల్లి, పాలక్కాడ్ డివిజన్లలో ఒక్క చోరీ కూడా నమోదు కాకపోవడం విశేషం.

ఎవరిపై భారం?

రైల్వే నిబంధనల ప్రకారం వస్తువుల బాధ్యత కాంట్రాక్ట్ ఏజెన్సీలదే. వస్తువులు పోయినప్పుడు ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి మినహాయిస్తారు. దురదృష్టవశాత్తూ ఆ కాంట్రాక్టర్లు రోజుకు కేవలం రూ.700 వరకు సంపాదించే అటెండెంట్ల జీతాల నుంచి ఈ మొత్తాన్ని (దిండుకు రూ.115, బ్లాంకెట్‌కు రూ.343 చొప్పున) కట్ చేస్తున్నారు. ప్రయాణికుల నిర్వాకానికి పేద కార్మికులు బలి కావడం ఆందోళనకరం.

నియంత్రణకు రైల్వే సరికొత్త వ్యూహం

కోచ్ మిత్ర యాప్: అటెండెంట్లు ఈ యాప్ ద్వారా ప్రయాణికుల బోర్డింగ్, డీ-బోర్డింగ్ సమయాలను ట్రాక్ చేస్తూ వస్తువుల పంపిణీని పర్యవేక్షిస్తున్నారు.

30 నిమిషాల రూల్: ప్రయాణం ముగియడానికి 30 నిమిషాల ముందే బెడ్‌రోల్ వస్తువులను తిరిగి సేకరించేలా ప్యాకెట్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ముద్రిస్తున్నారు.

సీసీటీవీ, ఆకస్మిక తనిఖీలు: కోచ్‌లలో నిఘా పెంచడంతో పాటు అనుమానాస్పద ప్రయాణికుల లగేజీని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌) సాయంతో చట్టబద్ధంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

మౌలిక వసతుల కల్పనపై పెట్టాల్సిన నిధులు ఇలాంటి ప్రత్యామ్నాయాలకు ఖర్చవుతుండటం శోచనీయం. ఇప్పటికైనా ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చదవండి: మళ్లీ సీన్‌ రివర్స్‌.. ధరల దడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement