ఐఏఎస్ (IAS) అధికారిణిని పెళ్లి చేసుకోవాలన్న ఉత్తరప్రదేశ్లోని ఒక యువకుడి కల ఖరీదైన పీడకలగా మారింది. ఎంతో ఘనంగా పెళ్లయిన కొద్ది గంటల్లోనే రాత్రికి రాత్రే వధువు కోటి రూపాయలకు పైగా విలువైన నగలు, విలువైన వస్తువులతో పరారైన ఘటన కలకలం రేపింది. నెట్టింట ఈ వింత పెళ్లి మోసం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏమైంది?
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా ఫరీద్పూర్ పరిధిలో గల పచోమి గ్రామానికి చెందిన అభిషేక్ పెళ్లి చేసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్నే పెళ్లి చేసుకోవా లనుకున్నాడు. సాధన అనే ఒక కిలాడీ తనను తాను ఐఏఎస్ అధికారిణిగా పరిచయం చేసుకుంటూ, సోషల్ మీడియాలో ప్రొఫైల్ను చూసి వెనుకా ముందు ఆలోచించకుండా భలే ఛాన్స్లే అనుకుంటూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా పెళ్లిదాకా తీసుకొచ్చాడు. అటు తమ ఇంటికి ఐఏఎస్ అధికారిణి కోడలిగా రాబోతుందనే ఆనందంతో అభిషేక్ కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఎంతో సంతోషంగా అంగీకరించారు. ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. అయితే, ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు.
శోభనం రాత్రే 'కోటి రూపాయల' తో జంప్
ఎఫ్ఐఆర్ (FIR) వివరాల ప్రకారం... పెళ్లయిన తర్వాత వధువు సాధన అత్తారింటికి చేరుకుంది. అక్కడ కుటుంబ సభ్యులు ఆమెకు పెద్ద ఎత్తున బంగారు, వెండి, వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇచ్చారు. అయితే, పెళ్లి జరిగిన మొదటి రాత్రి (శోభనం రాత్రి) భర్త అభిషేక్ నిద్రిస్తున్న సమయంలో, సాధన ఇంట్లోని విలువైన నగలు, నగదును బ్యాగ్లో సర్దుకుని అక్కడి నుండి పరారైంది. ఉదయం చూసేసరికి దాదాపు రూ. 1 కోటి విలువైన వస్తువులతో వధువు కనిపించకుండా పోవడంతో వరుడి కుటుంబం లబోదిబోమంది.
ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది
మోసపోయామని గ్రహించిన వరుడి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సాధన, ఆమె తండ్రి ,మరో ఇద్దరు కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు. ఈ నకిలీ ఐఏఎస్ వధువును పట్టుకోవడానికి బరేలీ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఇదీ చదవండి: 25 ఏకరాల భూమి కొన్న స్టార్ హీరో, ధర ఎంతో తెలుసా?
వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పొరుగున ఉన్న బుదౌన్ జిల్లాకు చెందిన ప్రధాన నిందితురాలు సాధనను అదుపులోకి తీసుకున్నారు. ఈమె వెనుక ఉన్న మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా గతంలో కూడా ఎవరినైనా ఇలాగే ఐఏఎస్ పేరుతో మోసం చేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నకిలీ ఐఏఎస్ ప్రొఫైల్, వివాహ మోసాల నెట్వర్క్ విస్తృతిపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తుండటంతో, ఈ కేసు స్థానికంగా విస్తృత చర్చనీయాంశ మైంది.


