పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్య ఆహ్వానం వచ్చింది. అయితే ఈ ఆహ్వానంతో పాటు కాంగ్రెస్ ఓ కీలక షరతును కూడా విధించింది. కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేయడం తన రాజకీయ జీవితంలో చేసిన తప్పేనని మమతా బెనర్జీ అంగీకరిస్తేనే జూలై 21న జరిగే కార్యక్రమానికి రావాలని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేతలు సూచించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.
కోల్కతాలోని షహీద్ మినార్ వద్ద జూలై 21న కాంగ్రెస్ నిర్వహించే కార్యక్రమానికి మమతా బెనర్జీని ఆహ్వానిస్తున్నామని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ తెలిపారు. అయితే 1998లో కాంగ్రెస్ను వీడి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించడం మమత తీసుకున్న రాజకీయంగా తప్పు నిర్ణయమని ఆమె అంగీకరించాలని ఆయన పేర్కొన్నారు.
‘షహీద్ దివస్’..
జూలై 21 రోజు మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో కూడా ప్రత్యేక ప్రాధాన్యత కలిగినది. 1993 జూలై 21న ఓటరు గుర్తింపు కార్డులను తప్పనిసరి చేయాలనే డిమాండ్తో అప్పటి యువ కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్న మమతా బెనర్జీ ఆధ్వర్యంలో కోల్కతాలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ ఆందోళన సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది కార్యకర్తలు మరణించారు. ఆ ఘటనకు గుర్తుగా మమతా బెనర్జీ ప్రతి ఏడాది జూలై 21ను ‘షహీద్ దివస్’గా నిర్వహిస్తూ వస్తున్నారు.
అయితే ఈ ఘటన జరిగిన సమయంలో మమతా బెనర్జీ కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాలు రావడంతో 1998లో పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించారు. అనంతరం బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ క్రమంగా బలమైన శక్తిగా ఎదిగింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభావం రాష్ట్రంలో తగ్గుతూ వచ్చింది. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలు, మమతా బెనర్జీ కాంగ్రెస్ను వీడటం వల్ల రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారిపోయాయని అంటున్నారు. కాంగ్రెస్ బలహీనపడటం వల్లే బెంగాల్లో బీజేపీకి ఎదగడానికి అవకాశం లభించిందని వారు వాదిస్తున్నారు.
కూటమి బీటలు..
శుభంకర్ సర్కార్ మాట్లాడుతూ, మమతా బెనర్జీ కాంగ్రెస్ను వీడకపోయి ఉంటే పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితులు మరోలా ఉండేవని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి విడిపోవడం చారిత్రక తప్పిదమని ఆమె అంగీకరించాలని కోరారు. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ రెండూ ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో భాగస్వాములుగా ఉన్నప్పటికీ, పశ్చిమ బెంగాల్లో మాత్రం ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగానే కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో పరస్పర విమర్శలు, ఆరోపణలు తరచుగా వినిపిస్తుంటాయి. కాంగ్రెస్ ఆహ్వానం, విధించిన షరతుపై ఇప్పటివరకు మమతా బెనర్జీ లేదా తృణమూల్ కాంగ్రెస్ అధికారికంగా స్పందించలేదు. అయితే జూలై 21 కార్యక్రమానికి ముందు మమత స్పందన ఎలా ఉంటుందన్నది బెంగాల్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


