కోల్కతా: మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు ఓ రైతు. ఆ ఫోన్ ద్వారా సైబర్ నేరగాళ్లు.. ఆ రైతు కూడబెట్టుకున్న డబ్బు మొత్తాన్ని కొట్టేశారు. పశ్చిమ బెంగాల్కు చెందిన జాతీయ అవార్డు గ్రహీత, వృద్ధ రైతు శైలేన్ చండి సైబర్ మోసానికి గురై తన బ్యాంకు ఖాతాల నుంచి రూ. 83,244 కోల్పోయినట్టు తెలిపారు. 3 నెలలకు పైగా పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ విభాగం, బ్యాంకు అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పటి వరకూ డబ్బు తిరిగి రాలేదు. సమస్యకు పరిష్కారం కూడా దొరకలేదు. ఆ రైతుకు ఏటీఎం కార్డు, ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యం లేవు. అయినా సైబర్ నేరగాళ్లు డబ్బు కొట్టేశారు. బ్యాంకులకే అర్థంకాని మిస్టరీగా మారింది ఈ కేసు.
రసాయన ఎరువులకు దూరంగా ఉంటూ, దేశీయ విత్తనాలతో మూలికల ఆధారిత, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ శైలేన్ చండి గుర్తింపు పొందారు. పర్యావరణహిత వ్యవసాయానికి చేసిన సేవలను గుర్తించి కేంద్ర మంత్రిత్వ శాఖ ఆయనకు 2019లో జాతీయ అవార్డు ఇచ్చింది. జీవిత చరమాంకంలో ఆయన ఇప్పుడు డిజిటల్ సాంకేతికత ద్వారా చీకటి జీవితాన్ని ఎదుర్కొంటున్నారు.
శైలేన్ చండి చెప్పిన వివరాల ప్రకారం.. మార్చి 29న ఆయన మొబైల్ ఫోన్ పోయింది. వెంటనే పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. పోయిన ఫోన్లోని సిమ్కు బ్యాంకు ఖాతాలు అనుసంధానం కావడంతో వెంటనే కొత్త సిమ్ తీసుకోవడానికి దరఖాస్తు చేశారు. కొత్త సిమ్ వచ్చిన తర్వాత మార్చి 31న ప్రభుత్వ రంగ బ్యాంకులోని ఒక ఖాతా నుంచి 2 వేర్వేరు లావాదేవీల్లో రూ. 6,000, రూ. 4,000 తీసుకున్నట్టు సందేశాలు చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు.
మోసానికి గురైనట్టు గుర్తించిన శైలేన్ చండి ఏప్రిల్ 1న శాంతిపూర్ పోలీసులకు, సైబర్ క్రైమ్ విభాగానికి విడివిడిగా ఫిర్యాదులు చేశారు. అయినా మోసం అక్కడితో ఆగలేదు. ఏప్రిల్ 2న ప్రభుత్వ రంగానికి చెందిన మరో బ్యాంకులోని ఆయన ఖాతా నుంచి 12 వేర్వేరు లావాదేవీల ద్వారా మరో రూ. 71,000 తీసుకున్నట్టు తెలిపారు.
బ్యాంకు అధికారులకూ అర్థం కావట్లేదు
ఈ ఘటనలో మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఆ 2 బ్యాంకు ఖాతాల్లోనూ ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యం ప్రారంభించలేదు. శైలేన్ చండి వద్ద ఏటీఎం కార్డు కూడా లేదు. ఏటీఎం కార్డు, ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యం లేకపోయినా ఇంత పెద్ద మొత్తం డిజిటల్ విధానంలో ఎలా తీసుకున్నారో చెప్పలేక బ్యాంకు అధికారులు కూడా అయోమయంలో ఉన్నట్టు సమాచారం.
ఈ ఘటన తర్వాత ఆ వృద్ధ రైతు 2 బ్యాంకుల మేనేజర్లకు, వారి నోడల్ అధికారులకు, సైబర్ క్రైమ్ విభాగానికి, భారతీయ రిజర్వు బ్యాంకు ప్రధాన శాఖకు లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించారు.
గుర్తుచేస్తూ లేఖలు పంపినా 3 నెలలకు పైగా గడిచినా ఇప్పటి వరకూ ఒక్క అనుమానితుడినీ గుర్తించలేదు. పోలీసుల వ్యవహార శైలి, దర్యాప్తు నెమ్మదిగా సాగుతున్న తీరు తనను తీవ్ర నిరాశకు గురి చేశాయని ఆయన చెప్పారు.
కన్నీటి పర్యంతమైన శైలేన్ చండి మాట్లాడుతూ, "కొంతమంది తాత్కాలిక లాభాల కోసం సంకర విత్తనాలు, రసాయనాలను వాడి వ్యవసాయంలో శాస్త్రాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టే, సైబర్ నేరగాళ్లు కూడా అక్రమ లాభాల కోసం శాస్త్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
నేరగాళ్లు వ్యవస్థను మించి తెలివిగా వ్యవహరిస్తూనే ఉంటే ఉన్నత విద్య, సైబర్ క్రైమ్ విభాగాలు, ప్రభుత్వ ప్రయత్నాల ఉద్దేశం ఏమిటి? సాంకేతికతను వాడి సామాన్య ప్రజలను మోసం చేసే వారే చివరకు అత్యంత శక్తిమంతులుగా నిలుస్తారా?" అని ప్రశ్నించారు. వృద్ధాప్యంలో కష్టపడి కూడబెట్టుకున్న పొదుపు మొత్తం కోల్పోయిన జాతీయ అవార్డు గ్రహీత రైతు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


