చాలామంది ఏళ్ల తరబడి కష్టపడితే గానీ సాధించుకోలేని జీవితం ఆమె సొంతం. మంచి కార్పొరేట్ ఉద్యోగం..సొంతంగా ఒక అపార్ట్మెంట్..ఫైనాన్షియల్గా కూడా ధీమాగా బతికే చక్కటి జీవితం ఆ విదేశీ మహిళది. అయినా అవేమి వద్దని భారతదేశంలోని ఓ మారుమూల గ్రామానికి వచ్చి ఉచితంగా పాఠశాలను నిర్వహిస్తుంది. అభాగ్యులకు, నిరుపేద ప్రజల పిల్లలకు గురువుగా మారి వారి జీవితాలను చక్కదిద్దుతోందామె. ఎవరా ఆ మహిళ అంటే..
ఆ మహిళే స్విట్జర్లాండ్కు చెందిన శాండ్రా లావీ గోజ్కోవిచ్. ఆమె స్విట్జర్లాండ్లోనే పెరిగింది. అక్కడే చదువుని పూర్తి చేసి దుబాయ్లో మంచి కార్పొరేట్ ఉద్యోగాన్ని కూడా సంపాదించింది. ప్రపంచమంతా పర్యటించింది. ఒక అందమైన అపార్ట్మెంట్ని కూడా సొంతం చేసుకుంది. మంచి కారుతో సహా ఆర్థిక పరంగా ధీమాగా ఉండే లైఫ్ ఆమెది.
కానీ ఆమె మదిలో వెంటాడే ప్రశ్న ఏంటంటే..ఇంతమంది చాలీచాలనీ జీవితం గడుపుతుంటే..తనకే ఎందుకు ఇంత లగ్జరీ లైఫ్ అని... అలా ఆమె పదిహేనేళ్ల క్రితం శాండ్రా తన లగ్జరీ లైఫ్ని వదులకోవాలనే గట్టిగా నిశ్చయించుకుంది. తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామ చేసి మరి భారత్కి వచ్చేసింది. భారతదేశంలోని సాంస్కృతి తనను ఫిదా చేసిందని, ఇది తన దృక్పథాన్నే మార్చేసిందని అంటోందామె. శాండ్రా తీసుకున్న ఆ నిర్ణయమే పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపంలో వందలాది మంది పిల్లలకు విద్యను అందించడంలో సహాయపడింది. అక్కడి మహిళలు, వారి కుటుంబ జీవితాన్ని మార్చేసింది.
రెండు చొక్కాలు, రెండు ఫ్యాంటులు..వన్వే టికెట్తో..
శాండ్రా భారతదేశమంతటా ఒంటరిగా ఎలాంటి నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా కేవలం రెండు చొక్కాలు, రెండు ఫ్యాంటులతో పర్యటించినట్లు చెప్పుకొచ్చింది. కనీసం తెలిసిన వాళ్ల భరోసా కూడా లేదని తెలిపింది. తను చేసిన పని గురించి తలుకుంటే చాలా పిచ్చిపనిగా అనిపిస్తుందని అంటోందామె. అయితే జీవితం మొదటిసారి పూర్తి స్వేచ్ఛను అనుభవించానని మాత్రం అంటోంది. ఇక్కడ పర్యటించడం అంత సులభం కాకపోయినా..ఏదు తెలియని ఆనందం దొరికేదని అంటోందామె. అయితే తను ఏదో సేవ చేయాలనుకున్నానని..అందుకోసం ఇప్పటికే ఉన్న స్వచ్ఛంద సంస్థలకు మద్దతిచ్చి చేతులు దులిపేసుకోవచ్చు కానీ అది తనకు నచ్చలేదని అంటోంది.
ఇక్కడ ఆ సంస్థల సొమ్ము దుర్వినియోగం అవ్వడం గమనించానని తెలిపింది. అసలు ప్రజలకు కావల్సింది..వాళ్ల అభ్యున్నతికి తోడ్పడే దిశగా అభివృద్ధి పనులు ఉండాలని తెలుసుకున్నానని అంటోందామె. ఆ మార్పు నగరాల్లో కాదని, గ్రామీణ ప్రాంతాల నుంచే సాధ్యమని గ్రహించా..అందుకోసమే..బయటవాళ్లకు కూడా తెలియని మారుమూల గ్రామానికి తీసుకువెళ్లమని చెప్పి మరి పశ్చిమ బెంగాల్లోని మారుమూల గ్రామమమైన సాగర్ ద్వీపానికి చేరుకున్నానని చెబుతోందామె. తను రెండున్నర గంటలు రైలు ప్రయాణించి, తదుపరి ఒక గంట పడవ జర్నీ చేసి మరి ఆ మారుమూల ద్వీపానికి చేరుకున్నట్లు తెలిపింది. ఆ ద్వీపం అత్యంత ఆధ్యాత్మికమైనది, కపిల ముని ఆశ్రమానికి నిలయం. ఆ ద్వీపంలో మూడు గ్రామాలను సందర్శించి..అక్కడ గ్రామస్తుల అవసరాలు స్వయంగా తెలుసుకుంది.
ప్రతి ఇంటి తలుపు తట్టి..
ఇంటింటికి తిరిగి ఒక విదేశీయురాలిగా తనపై నమ్మకం కలిగేలా చేసుకుని మరి..తమ పిల్లలను పాఠశాలకు పంపమని కోరినట్లు వెల్లడించింది. కొన్ని కుటుంబాలు సంకోచించగా, మరికొన్ని కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి. అలా ఒక చిన్నారితో మొదలై..క్రమంగా వందల మంది అయ్యారు. ప్రస్తుతం, శాండ్రా సంస్థ ఒకటి నుంచి ఐదు తరగతులలో 150 మంది పిల్లలకు విద్యను అందించే ఒక ఉచిత ప్రాథమిక పాఠశాలను నడుపుతోంది.
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న మరో 120 మంది పిల్లలు ట్యూషన్ ఫీజు, పౌష్టికరమైన రోజువారీ భోజనాన్ని అందిస్తోంది. ఈ సంస్థ 20 మంది మహిళలకు కుట్టుపనిలో శిక్షణ కూడా అందించి, ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించే నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో వారికి సహాయపడుతుంది. అంతేగాదు తన బృందంతో కలిసి గృహ హింస, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి వాటిపై అవగాహన కల్పిస్తుంది.
అలా మొదలైంది ఈ జర్నీ..
చాలా చిన్న వయసులో తన తల్లిదండ్రులు చేసే పర్యటనల వల్ల బాల్యంలోనే అత్యంత వైవిధ్యభరితమైన ప్రదేశాలు, సంస్కృతులు మనసులు బలంగా ముద్రపడిపోయాయి. ముఖ్యంగా కారవాన్ ప్రయాణాలు ప్రతి దేశంలోని ప్రజలతో సులభంగా మమేకమయ్యేందుకు అవకాశం కల్పించింది. విభిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులను కలవడం వల్ల మన నేపథ్యానికి భిన్నంగా ప్రంపంచాన్ని చూడటం ఎలాగో చిన్నప్పుడే నేర్చుకున్నానని చెబుతోందామె. అయితే తాను వదులుకున్న కార్పొరేట్ లైఫ్ వైపుకి తిరిగి చూడలేదని అంటోందామె.
ప్రస్తుతం తన సక్సెస్ని పదోన్నతులు, అధిక వేతనంతో చూడనని..పిల్లలతో నిండిన తరగతి గదులలో, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్న మహిళలలో, నెమ్మదిగా ఆశను కనుగొంటున్న కుటుంబాలలో చూస్తానంటోందామె. అంతేగాదు భౌతిక ఆస్తులు తాత్కాలికమైనవని, ఇతరులకు సేవ చేయడం, అవకాశాలను సృష్టించడం, అభాగ్యులకు అండగా నిలబడటంలో దొరికే సంతృప్తే వేరేలెవెల్ అని అంటోందామె. పైగా అభ్యాగులకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యం అని, తను బతికి ఉన్నంత కాలం కొనసాగిస్తానని చెబుతోందామె.
(చదవండి: 56 ఏళ్ల వయసులో మాస్టర్ డిగ్రీ..! పట్టరాని సంతోషంలో కుమార్తె..)


