భర్తను కోల్పోయి ఒంటిరి తల్లిగా పిల్లలను పెంచుతున్న ఓ మహిళ సాధించిన అసాధారణ విజయ గాథ నెట్టింట వైరల్గా మారింది. ఆమె కుమార్తె షేర్ చేసిన ఈ పోస్ట్ అందర్నీ అమితంగా ఆకర్షించడమే గాక.. మహిళలు ఏదైనా చేయగలరు అని నిరూపించింది. ఒకపక్క పిల్లలు బాధ్యత, కుటుంబ నిర్వహణ, ఉద్యోగం అన్ని చూసుకుంటూనే తన కలను నెరవేర్చుకోవడం అంటే మాటలు కాదు. సాధారణ విషయం అంతకన్నా కాదు. మరి ఆమె ఎలా సాధ్యం చేసిందంటే..
56 ఏళ్ల తల్లికి దుబాయ్కు చెందిన కంటెంట్ క్రియేటర్ నుమయా కారు సోషల్మీడియా వేదికగా హృదయపూర్వక నివాళి అర్పిస్తూ ఇలా రాసుకొచ్చింది. దశాబ్దాలుగా కుటుంబ అభ్యున్నతికి పాటుపడిన తన తల్లి ఇవాళ తన చిరకాల కోరికను నెరవేర్చుకుందంటూ అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
భర్తను కోల్పోయి ఒంటరిగా పిల్లలను పెంచుతూ..ఓ పక్క తల్లిదండ్రులను కూడా పోగొట్టుకుని పుట్టెడు బాధను దిగమింగుతూ.. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించిన స్ట్రాంగెస్ట్ విమెన్. అధిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాన్ని కూడా సమతుల్యం చేసుకుంటూ..కుటుంబాన్ని చక్కదిద్దిన మహిళ ఇవాళ తన చిరకాల కోరికను నెరవేర్చుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. తన జీవితం మొత్తం తన పిల్లల కోసమే బతికింది.
నాన్న చనిపోయాక..తొమ్మిదేళ్లుగా అమ్మగా నాన్నగా వ్యవహరించి..ఒంటరిగా ఆ బాధను మొత్తం మోసిన ధీర వనిత. పూర్తి సమయం పనిచేస్తూ పిల్లలను పెంచింది. ఏళ్ల తరబడి మూసి ఉంచిన ఒక ప్రభుత్వ పాఠశాలకు తొలి ప్రిన్స్పాల్గా నియమాకం అందుకుంది. ఇన్నేళ్లకు తన కోసం ఆలోచించడం మొదలు పెట్టి..మాస్టర్ డిగ్రీని పూర్తి చేసి, తన కలను సాకారం చేసుకుంది. "అమ్మా.. ఈ డిగ్రీ నీదే. ఒక కూతురుగా నాకెంతో గర్వంగా ఉంది. ఆమె గ్రాడ్యుయేషన్ డేలో తాను లేకపోవడం ఎంతో బాధగా ఉందని, అయినప్పటికీ ఒక కుమార్తెగా గర్వించే క్షణం ఇది అని" పోస్ట్లో రాసుకొచ్చింది.
ప్రస్తుతం తాను వేరే దేశంలో ఉన్నానంటే అందుకు ఆమెనే కారణం, అది ఆమె కోరుకున్న జీవితమే అని పేర్కొంది. "అమ్మా..నిజమైన బలం, నిస్వార్థ ప్రేమ ఎలా ఉంటాయో చూపిచావు. నేను మీలో కనీసం సగం అయిన ఉండగలిగితే బాగుండు. ఈ డిగ్రీ ఈదే. దీనికి మీకంటే ఎక్కువ అర్హులు ఎవరూ లేరు అంటూ తనపోస్టుని ముగించింది." నెటిజన్లు కూడా మీ కలలను సాకారం చేసుకోవడానికి ఎప్పుడు ఆలస్యం కాదు అంటూ..సదరు తల్లికి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు.
(చదవండి: 'సలాం సాబ్'.. 80 ఏళ్ల వ్యక్తిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు!)


