ప్రకృతితో ప్రమాదకర ఆట.. చైనా మెగా కలకు ముప్పు? | Chinese dam near India border a ticking geological bomb Here Full Details | Sakshi
Sakshi News home page

ప్రకృతితో ప్రమాదకర ఆట.. చైనా మెగా కలకు ముప్పు?

Jul 11 2026 7:49 AM | Updated on Jul 11 2026 7:51 AM

Chinese dam near India border a ticking geological bomb Here Full Details

భారత్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుపై తాజాగా భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మెడోగ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం నేరుగా క్రియాశీల భూకంప విరామ రేఖ (యాక్టివ్ ఫాల్ట్ లైన్)పై ఉందని చైనాకే చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు భూకంపాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదానికి అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఉండటంతో దీని భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

యార్లుంగ్ సాంగ్పోగా పిలిచే బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. సుమారు 147 బిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తిలో త్రీ గార్జెస్ డ్యామ్‌ను కూడా అధిగమిస్తుందని చైనా భావిస్తోంది. అయితే ప్రాజెక్టు ప్రాంతం కిందుగా విస్తరించిన పైజెన్ ఫాల్ట్ గత హిమయుగం నుంచి ఇప్పటికీ చురుకుగా ఉన్న భూకంప విరామ రేఖ అని చైనా ప్రభుత్వానికి చెందిన భూగర్భ సర్వే పరిశోధకులే గుర్తించారు.

ఈ ఫాల్ట్ లైన్ కారణంగా ప్రాజెక్టు పునాదుల స్థిరత్వం దెబ్బతినే అవకాశం ఉందని, కొండచరియలు విరిగిపడటం, భూకంపాల ప్రభావంతో ఆనకట్ట నిర్మాణం ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతంలోని శిలలు బలహీనంగా ఉండటంతో అదనపు రక్షణ చర్యలు, కొండచరియలు పడిపోకుండా ప్రత్యేక ఇంజినీరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, ఇప్పటికే భౌగోళిక ప్రమాదాలపై చైనా శాస్త్రవేత్తలే హెచ్చరికలు జారీ చేయడం ఈ మెగా ప్రాజెక్టుపై కొత్త చర్చకు దారితీసింది. ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుగా ప్రచారం పొందుతున్న ఈ నిర్మాణం భూకంప ముప్పును ఎలా ఎదుర్కొంటుందన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

భారత్‌ ఆందోళన.. 
టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న మెడోగ్ మెగా జలవిద్యుత్ ప్రాజెక్టు భారత్‌కు వ్యూహాత్మకంగానే కాకుండా పర్యావరణపరంగానూ ఆందోళన కలిగిస్తోంది. బ్రహ్మపుత్ర నది టిబెట్‌లో యార్లుంగ్ సాంగ్పో పేరుతో ప్రవహించి, అరుణాచల్ ప్రదేశ్‌లోకి సియాంగ్‌గా, అసోంలో బ్రహ్మపుత్రగా మారి చివరకు బంగ్లాదేశ్‌లో జమునా పేరుతో ప్రవహిస్తుంది. దీంతో ఎగువన చైనా చేపట్టే ఏ భారీ నిర్మాణమైనా దిగువన ఉన్న భారత్, బంగ్లాదేశ్‌లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టు వల్ల నది సహజ ప్రవాహంలో మార్పులు వస్తే అరుణాచల్ ప్రదేశ్, అసోంలోని వ్యవసాయం, తాగునీటి వనరులు, మత్స్య సంపద, నదీ పర్యావరణంపై ప్రభావం పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో అకస్మాత్తుగా భారీగా నీటిని విడుదల చేస్తే దిగువ ప్రాంతాల్లో వరదలు సంభవించే ప్రమాదం ఉంది. అదే ఎండాకాలంలో నీటి నిల్వలు పెంచితే భారత్‌కు వచ్చే నీటి పరిమాణం తగ్గే అవకాశం ఉందనే ఆందోళన కూడా ఉంది. అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం క్రియాశీల భూకంప విరామ రేఖపై ఉండటమే. ఒకవేళ భారీ భూకంపం సంభవించి ఆనకట్టకు నష్టం జరిగితే లేదా నిర్మాణంలో ఏదైనా పెద్ద ప్రమాదం చోటుచేసుకుంటే దిగువ ప్రాంతాలకు భారీ స్థాయిలో వరదలు వచ్చే ప్రమాదాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని భూగర్భ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే అరుణాచల్ ప్రదేశ్, అసోంలోని నదీ పరివాహక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

అయితే చైనా మాత్రం ఈ ప్రాజెక్టు ప్రధానంగా జలవిద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమేనని, బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని ఇతర ప్రాంతాలకు మళ్లించే ఉద్దేశం లేదని చెబుతోంది. అయినప్పటికీ సరిహద్దు దాటి ప్రవహించే నదిపై ఇంత భారీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండటంతో భారత్ నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తోంది. నది ప్రవాహానికి సంబంధించిన సమాచారాన్ని పారదర్శకంగా పంచుకోవాలని, దిగువ దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని చైనాను భారత్ కోరుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement