ప్రస్తుతం సమాజం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమాజంలో మంచి ఉన్నత హోదాలో ఉన్నవాళ్ల పిల్లలే పెడదోవ పట్టి..ఎలా నేరస్థులుగా మారుతున్నారో తెలిసిందే. ఒక పక్క డిగ్రీలు పెరుగుతున్నా..నేరాలు కూడా వాటికి తగ్గట్టుగా ఉండటం బాధకరం. అందుకు కారణం వృత్తిపరమైన విజయానికి ఇచ్చినంత ప్రాధాన్యత వ్యక్తిత్వ నిర్మాణానికి ఇవ్వకపోవడమేనని మేధావులు, వ్యక్తిత్తత్వ నిపుణులు నొక్కి చెబుతున్నారు. సరిగ్గా ఈ తరుణంలో యూపీ గౌవర్నర్ కుటుంబ విలువలు, పేరెంట్స్ బాధ్యత గురించి ఇచ్చిన స్పీచ్ అందర్నీ ఆలోచింపచేయడమే గాక..విద్య, వ్యక్తితత్వం ఎంత కీలకమైనవో తెలియజేసేరామె. ముఖ్యంగా ఆడపిల్లలకు ఇచ్చిన సందేశం మహిళా శక్తి గొప్పతనం, ఆమె ఏవిధంగా సమాజానికి మూలస్థంభమో వివరించారామె.
కాన్పూర్లో ఛత్రపతి షాహు జీ మహారాజ్ విశ్వవిద్యాలయం 41వ స్నాతకోత్సవంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్, యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ కుటుంబ విలువలు గురించి యువతను మేల్కొలిపేలా అద్భతంగా ప్రసగించారు. ఈ మేరకు ఆనందీ బెన్ ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహిళలు గొప్ప వృత్తులను చేపట్టడం కంటే ముందు..మీరు గొప్ప తల్లులుగా మారండి అని పిలుపునిచ్చారు. వివాహం తర్వాత కుటుంబంలో తమ పాత్రలను సమతుల్యం చేస్తూ..వృత్తిపరమైన విజయాలు సాధించాలని ఆనందీ బెన్ అన్నారు.
అలాగే పెళ్లితో చదువుకి స్వస్తి పలకొద్దని యువతులకు హితవు చెప్పారు. అన్నింటికంటే మహిళలు మంచి నిపుణురాలైన తల్లిగా మారండని, ఆ తర్వాత ఐఏఎస్ అధికారి అయినా, టీచర్ అయినా అని పిలుపునిచ్చారామె. అలాగే టీనేజ్ పిల్లలు కళాశాలల్లో చేరిన తర్వాత తల్లిదండ్రలు తమ బాధ్యత ముగిసిపోయిందని భావించకూడదని, వాళ్లని ఓ కంట కనిపెట్టాల్సిందేనని అన్నారు. ముఖ్యంగా వాళ్ల జీవితంలో జరిగే ప్రతీ కీలక విషయంలోనే పేరెంట్స్గా మీరు పాలుపంచుకోవాలని సూచించారు. ఆ సమయంలో ప్రవర్తించాల్సిన తీరు, నైతిక విలువల గురించి బోధించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు.
వాళ్లకు విద్యా నైపుణ్యం తోపాటు వ్యక్తిత్వ నిర్మాణంపై కూడా దృష్టి పెట్టేలా చేయాలన్నారు. అలాగే విశ్వవిద్యాలయ హాస్టళ్లు, వాటి పరిసర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారామె. దీంతోపాటు సమాజంలో గృహ హింస, మహిళలపై నేరాలు పెరగడానికి నైతిక విలువల క్షీణతే కారణమని అన్నారామె. విద్య కేవలం విద్యాపరమైన విజయాలకే పరిమితం కాకూడదని అన్నారు. డిగ్రీల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సమాజంలో ఇలాంటి నేరాలు కొనసాగుతున్నాయంటే..అది మన విద్యా వ్యవస్థ సక్రమంగా లేదనేందుకు సంకేతమన్నారు. అందుకే విద్యా పరిజ్ఞానంతో పాటు నైతిక విలువలు కూడా అంతే ముఖ్యం అని నొక్కి చెప్పారామె.
(చదవండి: దుఃఖాన్నే శక్తిగా మార్చింది..! స్ఫూర్తిగా నిలిచింది)


