మహా రాజకీయం.. సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు | Sharad Pawar And Eknath Shinde Meeting Sparks Political Buzz In Maharashtra, Sanjay Raut Raises Objections | Sakshi
Sakshi News home page

మహా రాజకీయం.. సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు

Jul 10 2026 7:10 AM | Updated on Jul 10 2026 10:49 AM

Sanjay Raut targets Sharad Pawar over Shinde meet In Maharashtra

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మధ్య జరిగిన భేటీ తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. ఈ సమావేశం తర్వాత ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (MVA)లో విభేదాలు తలెత్తాయా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ పరిణామంపై శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా, శరద్ పవార్ మహారాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ఏక్‌నాథ్ షిండే కార్యాలయానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం తన పార్టీ ఎమ్మెల్యేలతో కూడా అక్కడే సమావేశమయ్యారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అధికార పక్షం-ప్రతిపక్షం మధ్య ఏదైనా కొత్త రాజకీయ సమీకరణలు ఏర్పడుతున్నాయా అనే చర్చ మొదలైంది.

ఈ భేటీపై స్పందించిన సంజయ్ రౌత్..‘శరద్ పవార్‌పై మాకు పూర్తి గౌరవం ఉంది. ఆయన సిద్ధాంతంపై, ఆయన రాజకీయ నిబద్ధతపై మాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ ఏక్‌నాథ్ షిండే కార్యాలయానికి వెళ్లి సమావేశం నిర్వహించడం మాకు బాధ కలిగించింది. మా దృష్టిలో పార్టీని చీల్చిన వారు ద్రోహులు. అలాంటి వారికి గౌరవం, గుర్తింపు ఇచ్చినట్టుగా ఈ సమావేశం కనిపించింది. ఈ సమావేశానికి మరో స్థలం దొరకలేదా? తప్పనిసరిగా షిండే కార్యాలయంలోనే ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? అంటూ ప్రశ్నించారు. ఈ పరిణామం వల్ల శివసేన (UBT) కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా బాధపడ్డారు. ప్రజల్లో కూడా తప్పుడు సంకేతాలు వెళ్లాయి’ అని వ్యాఖ్యానించారు.

ఎన్సీపీ నేతలు ఫైర్‌.. 
అయితే, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(SP) నాయకులు మాత్రం ఈ విమర్శలను ఖండించారు. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనని, ఎంవీఏ కూటమిని వీడే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి రాజకీయ రంగు పులమడం సరికాదని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ భేటీ రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. అయితే శరద్ పవార్ వర్గం నుంచి మహా వికాస్‌ అఘాడీ కూటమిని వీడుతున్నట్లు లేదా అధికార కూటమితో చేతులు కలుపుతున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఊహాగానాలకే పరిమితమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement