భారత మార్కెట్లో మా ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ వెల్లడి
వెల్లింగ్టన్: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కింద తమ దేశం నుంచి భారత్కు ఎగుమతి జరిగే ఉత్పత్తుల్లో 57 శాతం ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు చేరుకుంటాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్లో పోస్టుచేశారు. ఇరుదేశాల మధ్య ఎఫ్టీఏ అమల్లోకి వచ్చిన తొలిరోజు నుంచే సున్నా శాతం సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు. ఈ ఒప్పందంతో న్యూజిలాండ్ వ్యాపారాలు భారీగా వృద్ధి చెందనున్నాయని తెలిపారు.
భారత మార్కెట్లో న్యూజిలాండ్ ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10, 11న న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. భారత ప్రధాని న్యూజిలాండ్కు వెళ్తుండడం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి. న్యూజిలాండ్తో వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలపై ప్రధాని మోదీ దృష్టిపెట్టనున్నారు. అంతేకాకుండా వ్యాపారవేత్తలు, క్రీడాకారులతోనూ సమావేశం కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి.


