బలపడిన అణు బంధం | India and Australia sign Joint Declaration on Defence, Security Cooperation | Sakshi
Sakshi News home page

బలపడిన అణు బంధం

Jul 10 2026 4:49 AM | Updated on Jul 10 2026 4:49 AM

India and Australia sign Joint Declaration on Defence, Security Cooperation

భారత అణు విద్యుత్‌ ప్రాజెక్టులకు ఇకపై ఆ్రస్టేలియా యురేనియం  

భారత్, ఆస్ట్రేలియా మధ్య కుదిరిన పౌర అణుశక్తి ఒప్పందం  

ఇరుదేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, ఆంథోనీ అల్బానీస్‌ భేటీ  

కీలక రంగాల్లో పరస్పరం సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయం  

ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందంపై కార్యాచరణ వేగవంతం  

ఓడల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణలో కలిసికట్టుగా అంగీకారం  

ఉగ్రవాదంపై ఆ్రస్టేలియాలో కలిసి పోరాటం సాగిస్తామన్న మోదీ  

18 ఒప్పందాలపై సంతకాలు చేసిన రెండు దేశాలు  

గురుగ్రామ్, బెంగళూరులో ఇక ఆ్రస్టేలియా యూనివర్సిటీల క్యాంపస్‌లు  

మెల్‌బోర్న్‌: భారత్, ఆస్ట్రేలియా మధ్య ‘అణు’బంధం మరింత బలపడింది. భారత అణు విద్యుత్‌ ప్రాజెక్టులకు యురేనియం సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. ఈ మేరకు ఇరుదేశాల మధ్య అత్యంత కీలకమైన పౌర అణుశక్తి ఒప్పందం కుదిరింది. సివిల్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ సహా సముద్ర భద్రత, అరుదైన ఖనిజాల రంగాలకు సంబంధించి పలు చరిత్రాత్మక ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్‌ గురువారం మెల్‌బోర్న్‌లో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. 

కీలక రంగాల్లో పరస్పరం సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆధునిక సాంకేతికతలు, సప్లై చైన్లు, రక్షణ, భద్రతా సహకారం, సముద్ర భద్రతా సహకార రోడ్‌మ్యాప్, ఇంధన భద్రత తదితర అంశాల్లో మొత్తం 18 ఒప్పందాలపై సంతకాలు జరగడం విశేషం. వీటిలో భారత తీర రక్షక దళం(ఐసీజీ), ఆ్రస్టేలియాకు చెందిన మారిటైమ్‌ బోర్డర్‌ కమాండ్‌(ఎంబీసీ) మధ్య జరిగిన ఒప్పందం కూడా ఉంది. ఇది సముద్ర చట్టాల అమలు, సముద్ర ప్రాంతాలపై అవగాహన, సముద్ర సరిహద్దుల రక్షణ వంటి అంశాలలో పరస్పర సహకారానికి దోహదపడుతుంది.  

ఇంధన భద్రతను బలోపేతం చేసుకుందాం  
ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం, ద్వైపాక్షిక పెట్టుబడి రక్షణ విధానాన్ని ఖరారు చేసే దిశగా కార్యాచరణను వేగవంతం చేయాలని భారత్, ఆ్రస్టేలియా నిర్ణయించాయి. ఓడల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణలో కలిసికట్టుగా పనిచేయడానికి ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి. భారత్,         ఆ్రస్టేలియాలు చారిత్రాత్మక పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేసిన 12 ఏళ్ల తర్వాత పౌర అణుశక్తి ఒప్పందం కుదిరింది. 

ఇంధన భద్రతా ఫ్రేమ్‌వర్క్‌ నిబంధనల ప్రకారం.. బొగ్గు, డీజిల్, ఇతర ద్రవ ఇంధనాలు, సహజ వాయువుల స్థిరమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన సరఫరాను కొనసాగించడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశాయి. 2028–29 సంవత్సరానికి గాను ఆ్రస్టేలియన్‌ డిఫెన్స్‌ కాలేజీలో భారతీయ సైనిక శిక్షకుడిని నియమించాలని నిర్ణయించారు. మరోవైపు భారత్‌లోని గురుగ్రామ్‌లో విక్టోరియా విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌ను నిర్వహించుకోవడానికి ఆ్రస్టేలియా పక్షానికి ఆమోద పత్రం అందజేశారు. బెంగళూరులో ఫ్లిండర్స్‌ యూనివర్సిటీ తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. భేటీ అనంతరం మోదీ, అల్బానీస్‌ ప్రకటన విడుదల చేశారు.  

భారత స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు నూతన శక్తి  
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అల్బానీస్‌తో అద్భుతమైన చర్చలు జరిగాయని నరేంద్ర మోదీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చర్చల ఫలితాలను ‘అసాధారణమైనవి’గా అభివర్ణించారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం, వాతావరణ చర్యలు, అణు శక్తి, కీలక ఖనిజాలు, సాంకేతికత, విద్య వంటి రంగాలపై చర్చించామని తెలిపారు. ఈరోజు అణు శక్తి రంగంలో ఒక కీలక ఒప్పందంపై సంతకం జరిగాయని అన్నారు. ఇది ఆ్రస్టేలియా నుంచి భారత్‌కు యురేనియం సరఫరాకు మార్గం సుగమం చేయడంతోపాటు భారత స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు నూతన శక్తిని ఇస్తుందని ఉద్ఘాటించారు. 

రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం  
ఉగ్రవాదం అనేది కేవలం ఏదో ఒక దేశానికే కాకుండా మొత్తం మానవాళికి తీవ్రమైన సవాలుగా పరిణమించిందని భారత్, ఆస్ట్రేలియాలు గుర్తించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. అందుకే ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం సాగిస్తామన్నారు. తమ సంకల్పం అచంచలమైనదని, సహకారం మరింత బలపడుతూనే ఉందని వెల్లడించారు. ఇండియాతో ఆ్రస్టేలియాకు ఉన్న సంబంధం నేడు ఉన్నంత కీలకమైనదిగా గతంలో ఎప్పుడూ లేదని ప్రధాని ఆంథోనీ అల్బానీస్‌ పేర్కొన్నారు. పౌర అణుశక్తికి సంబంధించిన ఒప్పందం శాంతియుత ప్రయోజనాల కోసం ఆ్రస్టేలియా నుంచి భారత్‌కు యురేనియం ఎగుమతులను సులభతరం చేస్తుందని వివరించారు.

 శిలాజ రహిత ఇంధన విద్యుత్‌ సామర్థ్యం వాటాను పెంచడానికి భారత్‌కు యురేనియం సరఫరా చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ఆ్రస్టేలియన్‌ వనరుల రంగానికి అదనపు మార్కెట్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. తమ భాగస్వామ్యం ఎన్నడూ లేనంత బలంగా ఉందని తేల్చిచెప్పారు. రక్షణ, భద్రతా సహకారంపై ఉమ్మడి ప్రకటన ‘ఆచరణాత్మక భాగస్వామ్యాన్ని’మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందన్నారు. భారతదేశాన్ని ఒక అగ్రశ్రేణి భద్రతా భాగస్వామిగా పరిగణిస్తున్నట్లు అల్బానీస్‌ ప్రకటించారు.  

భారత్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోండి  
ప్రతిపాదిత భారత్‌–ఆ్రస్టేలియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్తుతుందని పేర్కొన్నారు. గురువారం ఆ్రస్టేలియా–ఇండియా సీఈఓల ఫోరమ్, ఎకనామిక్‌ రోడ్‌మ్యాప్‌ బిజినెస్‌ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. 

భారత్‌లో విమానయానం, ఆర్థిక సేవలు, కీలక ఖనిజాలు, సాంకేతికత, ఆహార శుద్ధి వంటి రంగాల్లో వృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి విస్తృతంగా పెట్టుబడులు పెట్టాలని ఆ్రస్టేలియా పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకు పిలుపునిచ్చారు. ఇండియాలో 500 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ‘ఆ్రస్టేలియన్‌ సూపర్‌’కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పాల్‌ ష్రోడర్‌ చేసిన ప్రకటనను మోదీ స్వాగతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement